Off The Record: ఒకప్పటి కంచుకోట నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది టీడీపీ. సిట్టింగ్ ఎమ్మెల్యే లోకం నాగమాధవి, నియోజకవర్గ తెలుగుదేశం నాయకుల మధ్య విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. అభ్యర్థి ఎవరన్న దాంతో సంబంధం లేకుండా పార్టీ గుర్తుకు ఓటేసే నియోజకవర్గం ఇది అని టీడీపీ పెద్దలు సైతం అంగీకరిస్తారు. కానీ… గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఇది జనసేన కోటాలోకి వెళ్ళడంతో….కూటమి వేవ్లో లోకం మాధవికి ఛాన్స్ దక్కింది. ఎన్నికల సమయంలో స్థానిక టీడీపీ నాయకులు కొందరు మాధవికి సహకరించలేదని, అది గుర్తు పెట్టుకుని మరీ… ఆమె ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే… అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు విషయంలో కూడా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఏ చిన్న పని అయినా ఎమ్మెల్యే అనుమతి లేకుండా అధికారులు ముందుకు రావడం లేదని, తెలుగుదేశం నాయకులు పనుల కోసం వెళ్ళినా ఎమ్మెల్యే పర్మిషన్ తెచ్చుకోమని చెప్పడం అవమానంగా ఉంటోందని వాపోతున్నారట.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సమయంలో కొందరు స్థానిక టీడీపీ నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ఈ సమస్యను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే నాగమాధవి తమను పట్టించుకోవడం లేదని, పార్టీ నాయకులకు ప్రభుత్వ పనులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా ఇటీవల జరిగిన భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే ట్రయల్ రన్కు తనకు అనుకూలంగా ఉండే వారిని మాత్రమే ఎంపిక చేసి తీసుకువెళ్లారంటూ చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారట. ఎమ్మెల్యే భర్త వ్యవహార శైలి కూడా పార్టీకి ఇబ్బందిగా మారిందని వారు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం. ఫిర్యాదు చేయడం వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం లోకల్ టీడీపీ లీడర్స్కు షాకిచ్చినట్టు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఎమ్మెల్యే నాగమాధవి కూడా ముఖ్యమంత్రిని కలిసి తమ వైపు నుంచి వాదన వినిపించినట్టు తెలిసింది. నియోజకవర్గంలో కొందరు టీడీపీ నాయకులు అస్సలు సహకరించడం లేదని, తాను ఎక్కడికైనా పర్యటనకు వెళ్తే అక్కడ సమస్యలు సృష్టిస్తున్నారంటూ రివర్స్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది. ఇటీవల బియ్యం పంపిణీ కార్యక్రమంలో కూడా కావాలనే మత్స్యకారులను రెచ్చగొట్టారంటూ ఆధారాలు చూపించినట్టు తెలుస్తోంది.
అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, కొందరు నాయకులు అధికారులను నేరుగా ప్రభావితం చేసి పనులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా వివరించినట్లు సమాచారం. అదంతా విన్న ముఖ్యమంత్రి రివర్స్లో స్థానిక టీడీపీ నాయకులకే క్లాస్ తీసుకున్నారన్న ప్రచారం నెల్లిమర్లలో జోరుగా జరుగుతోంది. కూటమి ధర్మానికి కట్టుబడి ఎన్నికలటైంలో నానా కష్టాలుపడి గెలిపించుకున్న నాయకురాలు ఇప్పుడు తమకే ఎసరు పెడుతున్నారంటూ అసంతృప్తిగా ఉన్నారట కొందరు నెల్లిమర్ల టీడీపీ నాయకులు. ఈ పరిస్థితుల్లో కొందరు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారని సమాచారం. సమావేశాలకు హాజరైతే…. అమరావతి చర్చల గురించి ఎవరైనా అడుగుతారేమోనన్న అవమానభారంతో ముఖం చాటేస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ఒకప్పటి కంచుకోటలో తీరు మారకుంటే టీడీపీ ఆటోమేటిగ్గా బలహీనపడే ప్రమాదం ఉందన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.