Off The Record: భారత రాష్ట్ర సమితిలో తన పాత్రపై స్పష్టత కోరుతున్న కవిత ఇక దూకుడు పెంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఏదో… ఇస్తే తీసుకున్నట్టు కాకుండా…. తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారట ఆమె. తండ్రి కేసీఆర్కు ఆమె రాసిన లేఖ బయటికి లీకవడం, దాని మీద పెద్ద స్థాయిలో రాజకీయ రచ్చ అవుతున్న క్రమంలో కేసీఆర్ దూతలు ఇద్దరు కవితతో నేరుగా సమావేశమై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే… నేనడిగే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు వచ్చేదాకా, పార్టీలో నా పాత్ర ఏంటో తేలేదాకా… మాటల్లేవ్… మాట్లాడుకోవడాల్లేవ్ అని వాళ్ళకి తేల్చి చెప్పేసినట్టు సమాచారం. ముందు నా సంగతేంటో తేల్చండి. ఆ తర్వాతే మిగతా విషయాలు మాట్లాడుకుందాం.. అంటూ ఆమె క్లియర్గా చెప్పేశారట. ఒక రకంగా ఇది స్వీట్ వార్నింగ్ అన్న అభిప్రాయం బలుపడుతోంది రాజకీయవర్గాల్లో. కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన మాజీ ఎంపీ దామోదర్ రావు, గండ్ర మోహన్రావు కవితను కలిశాక రెండు ప్రధానమైన డిమాండ్స్ తెర మీదికి వచ్చాయట. బీఆర్ఎస్లో తన భవిష్యత్తు గురించి, తన పాత్ర ఏంటో కూడా స్పష్టత ఇవ్వాలని కవిత కోరినట్టు తెలిసింది.
Read Also: SHOX Value: పురుషులు స్త్రీల కంటే ఎందుకు ఎత్తుగా ఉంటారు? రహస్యాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు..
అలాగే… తండ్రికి తాను రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలుసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. దూతలు ఇచ్చిన సమాధానాలతో ఆమె ఒకింత చల్లబడ్డారన్న మాటలు వినిపిస్తున్న టైంలోనే ఊహించని పరిణామం ఒకటి జరిగింది. ఆ భేటీ ముగిసిన 24 గంటల్లోనే కవిత సింగరేణిలో జాగృతి అనే కొత్త సంస్థ ప్రారంభించారు. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని అభిప్రాయ పడుతున్నారు ఎక్కువ మంది. ఇప్పటికే బీఆర్ఎస్కు అనుబంధంగా సింగరేణిలో టీజీబీకేఎస్ ఉంది. అయితే కవిత దీనిని పక్కన పెట్టి జాగృతి సింగరేణి విభాగంను ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం ఏంటన్న చర్చ నడుస్తోంది రాజకీయవర్గాల్లో. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ అధిష్టానానికి వార్నింగేనన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ చర్యతో మూడు ముఖ్యమైన సంకేతాల్ని పార్టీ అధినేతకు పంపాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన సొంత బలాన్ని చాటుకోవడానికి కవిత ఆరాటపడుతున్నారన్నది తొలి సంకేతం. ఇక అధిష్ఠానాన్ని నేరుగా ప్రశ్నించకపోయినా పరోక్షంగా తన పాత్రను గుర్తించాలన్న డిమాండ్ ఉందని అంటున్నారు. మూడోది తనను నిర్లక్ష్యం చేస్తే కొత్త వేదికలు తయారు చేసుకుని ముందుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోనని చేస్తున్న హెచ్చరిక కావచ్చన్నది విశ్లేషకుల మాట.
Read Also: Pakistan: పాకిస్తాన్లో భూకంపం.. 4.2 తీవ్రత నమోదు..
అయితే… తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం, ఆయన ఏమనుకుంటున్నారో బయటికి తెలియకపోవడంతో… బీఆర్ఎస్ కేడర్లో అయోమయం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవైపు దూతల ప్రత్నాలు ఫలించకపోగా…. మరోవైపు అధినేత నిశ్శబ్దం కేడర్ని డైలమాలో పడేస్తోందని అంటున్నారు. తగ్గేదే లే అంటున్న కవిత ఈ ఎపిసోడ్ను ఎంతదాకా తీసుకువెళ్తారన్న చర్చ కూడా జరుగుతోందట బీఆర్ఎస్ వర్గాల్లో. అసలు ఆమె బలమెంత? తిరుగుబాటు ఎక్కడికి చేరుతుంది, కేసీఆర్ దీన్ని ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలకు ప్రస్తుతానికి మౌనమే సమాధానం అట. అయితే… కవిత సొంత వేదికలను సిద్ధం చేసుకుంటున్నందున కాస్త ఓపిక పడితే… ఆ ముచ్చటేందో కూడా తెలిసిపోతుంది కదా అన్న ఆలోచన గులాబీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇది తాత్కాలిక భేటీలు, ఒకటి రెండు మీటింగ్స్తో తేలిపోయే అంశం కాదని, అంతర్గతంగా రాజకీయ సమీకరణాలను మార్చే ఘట్టమేనన్న వాదన బలపడుతోంది. పరిణామాలు ఎట్నుంచి ఎటు మారతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.