Off The Record: ఏపీలో డైలాగ్ వార్ పీక్స్కు చేరుతోంది. సినిమా డైలాగ్స్ కన్నా… పొలిటికల్ స్క్రీన్ మీద పంచ్లు పేలిపోతున్నాయి. కొన్ని హాట్ టాపిక్ అవుతుంటే… మరికొన్ని తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. పుష్ప 2 సినిమాలోని రప్ప రప్ప డైలాగ్ చుట్టూ రాజకీయ అగ్గి రగులుకుంటోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పల్నాడు టూర్లో మొదలైన డైలాగ్ వివాదం… ఇప్పుడు రాయలసీమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రాంత నేతలు, ముఖ్యంగా తాడిపత్రి నాయకులు రెగ్యులర్గా చేసుకునే సవాళ్లు, వాడే భాష ఎప్పుడూ చర్చనీయాంశమే. కాకుంటే… ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా…. రప్ప రప్పతో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు తాడిపత్రి లీడర్స్. తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వాడిన పదాల చుట్టూ.. కొత్త రాజకీయం మొదలైంది నియోజకవర్గంలో. ఎన్నికల ఫలితాల తర్వాత తాడిపత్రి టౌన్లో అడుగుపెట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు పెద్దారెడ్డి. దాని కోసం కోర్ట్కు వెళ్ళాల్సి వచ్చింది. అయినా… శాంతిభద్రతల సమస్య అని చెబుతున్నారు పోలీసులు.
Read Also: Off The Record: సైలెంట్ మోడ్లోకి బాలినేని..! పవన్ చెప్పేశారా..?
తాజాగా ఉన్నట్టుండి టౌన్లోని తన ఇంట్లో ప్రత్యక్షం అయ్యారు పెద్దారెడ్డి. దాన్ని ఉద్దేశించి… దొడ్డి దారిన తాడిపత్రికి రావడం కాదు… దమ్ముంటే నేరుగా రా…. రప్ప రప్ప అని నరక్కపోతే అడుగు అంటూ…పెద్దారెడ్డికి నేరుగా సవాల్ విసిరారు జేసీ. ఇదే ఇప్పుడు రచ్చ అవుతోంది. ఏడాదిగా పెద్దారెడ్డి తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైకోర్ట్ అనుమతులు ఉన్నా…. శాంతిభద్రతల కారణంగా నిరాకరిస్తూ వస్తున్నారు. అయితే ఆదివారం నాడు ఎవరికీ చెప్పకుండా ఎంట్రీ ఇచ్చేసి…. తన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు పెద్దారెడ్డి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన్ని తిరిగి అనంతపురం పంపారు. దీనిపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. నన్ను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నాడని.. నేను తాడిపత్రిలో ఉంటే అతని ఆగడాలు సాగవని, అందుకే ఇలా చేస్తున్నాడని కామెంట్ చేశారు పెద్దారెడ్డి. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని.. నేను కచ్చితంగా తాడిపత్రికి వెళ్లి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా… నన్ను తాడిపత్రికి రమ్మని సవాల్ విసిరి మళ్ళీ పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఏంటని కూడా జేసీని ప్రశ్నించారాయన. ఇలాంటి రాజకీయాలను వేరే పదంతో పిలుస్తారంటూ… చెప్పరాని భాషలో విరుచుకుపడ్డారు పెద్దారెడ్డి. అందుకు జేసీ కూడా తనదైన స్టైల్లో ఓ రేంజ్లో ఛాలెంజ్ చేశారు.
Read Also: Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి ..
నాకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు శత్రువులు కాదు, మా శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, ఆయన వెంట ఎవరు వెళ్లినా వాళ్ళ భరతం పడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రికి దొంగతనంగా వచ్చావని, దొరతనంగా రాలేదని… నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా..మా కార్యకర్తలు నిన్ను రప్ప రప్ప చేస్తారంటూ…. అదే డైలాగ్ను నాలుగు సార్లు చెప్పి మరీ… పెద్దారెడ్డిని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటిని మా కార్యకర్తలు జేసీబీలతో కూల్చివేస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన చాలా మాటలన్నా… ఇప్పుడు చర్చ అంతా రప్ప రప్ప డైలాగ్ చుట్టూనే తిరుగుతోంది. నిన్నటిదాకా వైసీపీ నేతలు మాత్రమే దాన్ని వాడారని, అదేం భాష అంటూ… వాళ్ళని ఆక్షేపించిన టీడీపీ… ఇప్పుడు తమనేత వాడుతున్న భాషను ఎలా సమర్ధించుకుంటుందని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు.