Off The Record: శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది పాలిటిక్స్లో చాలా కామన్. వేరువేరు జెండాల కింద పనిచేసినప్పుడు దుమ్మెత్తి పోసుకునే నేతలు ఒకే గూటి కిందకు వచ్చి చిలక పలుకులు పలకడం కొత్తేం కాదు. ఇప్పుడు ఆ జోన్లోకి వచ్చారు.. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాసులు. ప్రస్తుతానికి ఒకే గూట్లో లేకున్నా… ఇద్దరి పొలాల్లో మొలకలొస్తున్నాయట. 2024 ఎన్నికల్లో భీమిలి గడ్డ మీద ప్రత్యర్థులుగా తలపడ్డ ఇద్దరు నేతలు ఇటీవల రకరకాల ఫంక్షన్స్ పేరుతో తరచూ కలవడం విశాఖలో పొలిటికల్ హాట్ అవుతోంది. ఎన్నికల యుద్ధంలో హోరాహోరీ తలపడిన నేతలైనా…..పెళ్ళిళ్ళు, ఇతర ఫంక్షన్స్లో ఒకే వేదిక పంచుకోవడం కొత్తేం కాదు. కానీ…. ఇక్కడ మాత్రం సంథింగ్ స్పెషల్ అనే అకేషన్స్కు పిలుచుకోవడం, సంధింగ్ సంధింగ్ అన్నట్టుగా మాట్లాడుకోవడం మాత్రం ప్రత్యేకంగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఉమ్మడి విశాఖ జిల్లాలో గంటా శ్రీనివాస్ పొలిటికల్ ట్రాక్ రికార్డ్ మొత్తం సక్సెస్ చుట్టూనే తిరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యే…ఒకసారి ఎంపీ….రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. ఇక 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి శ్రీనివాస్… రెండు సార్లు భీమిలి నుంచి ఎమ్మెల్యేగా…. ఒకసారి ఎంపీగా గెలిచారు. గత వైసీపీ సర్కార్లో మొదటి మూడేళ్లు మంత్రిగా పనిచేశారాయ.
అవంతి మంత్రి అయ్యాక అంతకు ముందు గంటా శ్రీనివాస్తో ఉండే సత్సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే… అప్పట్లో మంత్రిగా జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిన అవంతి గంటా ఇష్యూ వచ్చే సరికి ఫ్రస్టేషన్తో ఊగిపోయేవారు. మొదట్లో తనను రాజకీయ ప్రత్యర్థిగా అవంతి భావించడాన్ని లైట్ తీసుకున్న గంటా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి తీవ్రంగా పరిగణించారు. ఇద్దరూ భీమిలిలోనే పోటీపడటం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ గంటా గెలుపు, అవంతి ఓటమి రెండూ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణం అయ్యాయి. రాష్ట్రంలోనే సెకండ్ హయ్యస్ట్ మెజారిటీ సాధించిన గంటా తన ఎలక్షన్ ప్రణాళికలకు తిరుగులేదని నిరూపించుకుంటే….ఓటర్ల తీర్పు ఏకపక్షం కావడంతో కినుక వహించిన అవంతి రాజకీయ స్తబ్ధత పాటించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన రాజకీయ ప్రయాణంపై చాలా ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చినా….అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇక గంటా మరోసారి మంత్రి పదవి ఆశించినా నిరాశే మిగిలింది. ఇక ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన అవంతి భవిష్యత్ కార్యాచరణపై ఎటువంటి ప్రణాళిక లేకుండానే ముందుకు సాగినట్టు కనిపించింది. ఈ పరిస్థితుల్లో…ఇద్దరూ మాజీ మంత్రులు తరచూ కలుస్తుండటంపై కూటమి వర్గాలు తెగ గుసగుసలాడేసుకుంటున్నాయి. ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉండగానే…. గంటా సూచన మేరకు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో అవంతి సీరియస్గా ఉన్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ప్యాచ్వర్క్లో భాగంగానే గతం గత: అనుకుంటూ ఫ్యామిలీ వేడుకలకు తప్పకుండా హాజరు అవుతున్నారా..?అనే చర్చ జరుగుతోంది.
అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రయాణం ఇక ఎటువైపు అన్న చర్చ ఇటీవల ఎక్కువైంది. ఆయన తిరిగి వైసీపీ తరపున భీమిలిలో యాక్టివ్ అవుతారని అనుకుంటున్నా….ఆ సీటు ఇప్పుడు ఖాళీ లేదు. జగన్కు సన్నిహితుడిగా ముద్రపడ్డ విజయనగరం జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇక్కడ ఫ్యాన్ పార్టీ రాజకీయాలను హోరెత్తిస్తున్నారు. చిన్న శ్రీను తనంతట తానుగా భీమిలిని వదిలిపెడితే తప్ప ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. పైగా… మూడేళ్ల ముందుగా ప్రతిపక్షంలో వుండి ప్రభుత్వ వ్యతిరేక గళం విప్పే ఆలోచనే ఉంటే… అసలు వైసిపికి రాజీనామా చేయాల్సిన అవసరమే అవంతికి లేదు. ఈ లెక్కన ఆయన చూపు కుదిరితే టీడీపీ లేదంటే జనసేన వైపు అన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. గతంలో గంటా పోటీ చేసి గెలిచిన ఏదో ఒక స్థానాన్ని తనకు రిజర్వ్ చేసుకోగలిగితే ఇప్పటి నుంచే అక్కడ రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ సహాయ సహకారాల కోసమే పాత విభేదాలు రిఫ్లెక్ట్ అవకుండా అవంతి జాగ్రత్త పడుతున్నారా…? అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. గంటా ఇంట్లో వేడుకలకు హాజరై అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అవంతి స్నేహితుడితో పూర్వ బంధాన్ని పునరుద్ధరించుకుంటారా…..లేక కర్టసీ కోసం పిలిస్తే వెళ్లాను తప్ప నా దారి నాదేనని నిరూపించుకుంటారా అన్నది కాలమే తేల్చాలి.