Off The Record: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైసీపీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన పార్టీ అధినేత జగన్కు నమ్మిన బంటు అని చెప్పుకుంటారు. ఆ క్రమంలోనే… గత ఎన్నికల్లో చెవిరెడ్డిని చంద్రగిరి నుంచి ఒంగోలు పంపి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు జగన్. గతంలో కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి కంచు కోటలా మారిన ఒంగోలు లోక్సభ సీట్లో సునాయాసంగా గెలుస్తారని భావించినా… స్వయంకృతాలతో ఆ స్థానం చేజారింది. పార్టీ ఆవిర్భావం తర్వాత… ఒంగోలు నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా భారీ విక్టరీలు సాధించిన వైసీపీ… గత ఎన్నికల్లో మాత్రం చతికిలపడింది. అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డికి టిక్కెట్ నిరాకరించటంతో ఆయన టీడీపీలో చేరి గెలిచారు. ఈ ఎంపీ సీటు పరిధిలో ఒక్క ఒంగోలు అసెంబ్లీ మినహా… మిగతా ఆరు నియోజకవర్గాల అభ్యర్ధులను మార్చటం వైసీపీకి మైనస్ అయింది. దీంతో… దర్శి, ఎర్రగొండపాలెం మినహా మిగిలిన ఐదు సీట్లలో వైసీపీ అభ్యర్దులు ఓడిపోవటం ఎంపీ అభ్యర్థి మీద కూడా ప్రభావం చూపించిందన్న అభిప్రాయం గట్టిగా ఉంది. దీనికి తోడు నాన్ లోకల్ సెంటిమెంట్ కూడా చెవిరెడ్డి ఓటమికి కారణమైందని చెప్పుకుంటారు. ఇక ఓటమి తర్వాత ఆ తర్వాత లిక్కర్ కేసులో చెవిరెడ్డి అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం వరుస పరిణామాలు. బెయిల్ మీద బయటకు వచ్చాక మాజీ ఎమ్మెల్యే జిల్లా రాజకీయాలకు దూరంగా ఉండటంతో….ఇక చంద్రగిరికే పరిమితం అవుతారని అంతా భావించారు.
ఒంగోలు ఇన్ఛార్జ్గా వైవీ సుబ్బారెడ్డిని ప్రకటిస్తారని కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ… తాజాగా దర్శిలో ప్రత్యక్షం అయ్యారు భాస్కర్ రెడ్డి. ఇక్కడ జరిగిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారాయన.పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి బహిరంగంగా మద్దతు ప్రకటిస్తూ మాట్లాడటం పార్టీలో, జిల్లా పొలిటికల్ సర్కిల్స్లో చర్చగా మారింది. గత ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీని రీసెట్ చేసే పనిలో ఉందట అధిష్టానం. అలాంటి సమయంలో చెవిరెడ్డి మళ్లీ ఫీల్డ్లోకి రావడం వ్యక్తిగత నిర్ణయమా.. లేక పార్టీ అధిష్టానం వ్యూహంలో భాగమా అన్న చర్చలు నడుస్తున్నాయి. అయితే… ఇది వ్యక్తిగతం కాదన్నదే ఎక్కువ మంది అభిప్రాయం. ప్రకాశం జిల్లాలో కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడాక ఏర్పడిన ఖాళీని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుండటంతో… ఆయనకు మద్దతుగా మరో బలమైన నాయకుడు అవసరమనే ఆలోచన కూడా ఉందట.
దర్శి సభలో చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను గమనిస్తే… అధికారపక్షాన్ని కలిసి ఎదుర్కొందాం అన్న సందేశం ఇచ్చినట్టుగా పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి..అధికార పక్షం బూచేపల్లి క్వారీలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని.. రాబోయే రోజుల్లో… తామిద్దరం కలిసి అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొంటామని చెవిరెడ్డి హింట్ ఇచ్చారు. దీంతో… ఆయన కొనసాగుతారని క్లారిటీ వచ్చేసినట్టేనని చెబుతున్నారు. అయితే.. ఈ రీఎంట్రీపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెవిరెడ్డి లాంటి దూకుడు స్వభావం ఉన్న నాయకుడు తిరిగి యాక్టివ్ అయితే కేడర్లో ఉత్సాహం పెరుగుతుందని కొందరు భావిస్తుంటే… మరికొందరు మాత్రం స్థానికంగా అందుబాటులో ఉండే నాయకుడు కావాలని అంటున్నారు. నాయకుడు అందుబాటులో ఉంటేనే… పార్టీకి బూస్టప్ వస్తుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో…. భాస్కర్రెడ్డి కొన్ని కార్యక్రమాలకే పరిమితం అవుతారా? లేక పూర్తి స్థాయిలో ఒంగోలు పార్లమెంట్ బాధ్యతల్ని పార్టీ ఆయనకే అప్పగిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

