ఆయనో పెద్దపదవిలో ఉన్నారు. ఆ పదవి చేపట్టాక నియోజకవర్గం దాటి వెళ్లింది లేదు. రాజకీయ అంశాలపై అంతగా మాట్లాడింది కూడా లేదు. అలాంటిది ఉన్నట్టుండి ఫైర్ అయ్యారు. రాజీనామా చేద్దాం రండి.. అంటూ సవాల్ విసిరారు. ఆయన ఎందుకంత సీరియస్ అయ్యారు? పెద్దాయనకు ఆగ్రహం కలిగించేంత పరిణామాలు ఏం జరిగాయి? జిల్లాలో ఇదే చర్చ. ఆయనెవరో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
సవాళ్లతో వేడెక్కించిన స్పీకర్ పోచారం!
పోచారం శ్రీనివాస్రెడ్డి. తెలంగాణ స్పీకర్. గతంలో మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రమంతా పర్యటించేవారు. సభాపతి అయ్యాక తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడను దాటి బయటకు వెళ్లింది తక్కువే. మంత్రిగా ఉన్న సమయంలో ప్రత్యర్థిపార్టీలపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించిన పోచారం.. స్పీకర్ అయ్యాక.. ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ కామెంట్స్ తగ్గించారు. ఒకవేళ మాట్లాడినా అవి బాన్సువాడ పరిధిలోనే ఉండేవి తప్ప.. పెద్దగా ప్రచారంలోకి వచ్చిందీ లేదు. ఇటీవల బాన్సువాడ కేంద్రంగా వైరిపక్షాలు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులివ్వాలని అనుకున్నారో ఏమో.. పెద్ద అస్త్రమే సంధించారు. తన కామెంట్స్తో జిల్లా రాజకీయాలను ఒక్కసారిగి వేడెక్కించారు సభాపతి.
సభాపతి అయ్యాక పొలిటికల్ కామెంట్స్కు దూరం!
ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయని అభ్యంతరాలు తెలియజేసిన పోచారం.. పేరు ప్రస్తావించకుండా ప్రత్యర్ధిపార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకంటే దేశంలో వేరే ఏ రాష్ట్రంలో చేసినట్టు చూపించినా ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని సవాల్ చేశారు పోచారం. ఈ సవాలే చర్చగా మారింది. సభాపతి అయ్యాక పొలిటికల్ కామెంట్స్కు దూరంగా ఉంటూ వచ్చిన ఆయన ఎందుకు ఆ స్థాయిలో బరస్ట్ అయ్యారని ఆరా తీస్తున్నారట.
అంగన్వాడీ సెంటర్ రగడలో పోచారంపై బీజేపీ విమర్శలు!
ఆ మధ్య బాన్సువాడలో అంగన్వాడీ సెంటర్ను ప్రారంభించడానికి వెళ్లారు స్పీకర్ పోచారం. ఆ ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఉంటున్నారు. తనను ఎక్కడ ఖాళీ చేస్తారో అని ఆందోళన చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది కాస్తా రాజకీయ రచ్చగా మారింది. ధర్నాలు చేపట్టిన బీజేపీ .. పోచారంపై గురి పెట్టింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే..విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలు బాధించాయో ఏమో.. ఓపెన్ అయిపోయారు స్పీకర్. సభాపతి స్పందించిన తీరు..వెల్లడించిన అంశాలు.. చేసిన సవాళ్ల వెనక బ్యాక్ గ్రౌండ్ అదేనని చర్చిస్తున్నారు.
పోచారం చేసిన కామెంట్స్తో కేడర్లో జోష్..!
పాలిటిక్స్లో సవాళ్లు.. రాజీనామా డిమాండ్స్ కామనైనా.. స్పీకర్గా ఉన్న పోచారం నోటి వెంట ఆ పదాలు రావడంతో అంతా అటెన్షన్ వచ్చింది. బీజేపీ పేరును ప్రస్తావించకపోయినా.. కాషాయ దళం విమర్శలకు తమ నేత గట్టిగానే కౌంటర్ ఇచ్చారని పోచారం అనుచరులు, పార్టీ కేడర్ అభిప్రాయపడుతోందట. మరి.. రానున్న రోజుల్లోనూ ఆయన ఇదే విధంగా స్పందిస్తారో లేదో అన్నది స్థానికంగా జరుగుతున్న చర్చ.