OTR: అక్కడి మాజీ ఎమ్మెల్యేల్లో వోవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతోందా? ఏం చేసినా, చేయకున్నా… ఈసారి అధికారం మాదేనని ఊహాలోకంలో విహరిస్తున్నారా? మేం మాజీలం కాదు, కాబోయే ఎమ్మెల్యేలం అన్న మాటలు ఎలా అనగలుగుతున్నారు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎవరా వోవర్ కాన్ఫిడెన్స్ మాజీలు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మొన్నటి వరకు గులాబీ పార్టీకి కంచుకోట. రెండు సార్లు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. కానీ… గత ఎన్నికల్లో జిల్లాలో బాల్కొండ నుంచి ప్రశాంత్ రెడ్డి, బాన్సువాడలో పోచారం మినహా మిగతా ఏడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓడిపోయింది. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్కు దగ్గరయ్యారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా మొత్తం మీద గులాబీ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే , ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ యాక్టివ్గా ఉన్నారు. కానీ… మిగతా మాజీలంతా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఊహా లోకంలో విహరిస్తున్నారట. మేం మాజీ ఎమ్మెల్యేలం కాదు…. కాబోయే ఎమ్మెల్యేలం అంటూ అంతర్గత సమావేశాల్లో అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
మాజీల మాటలు వింటున్న క్యాడర్ మాత్రం… వాస్తవ పరిస్దితులకు వాళ్ళ మాటలకు పొంతన కుదరక అయోమయానికి గురవుతోందట. ప్రజల్లో ఉండకుండా, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయకుండా.. మేమే కాబోయే ఎమ్మెల్యేలం అంటే నడుస్తుందా అన్నది వాళ్ళ క్వశ్చన్. చాలా నియోజకవర్గాల్లో… ప్రజా మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉన్నా.. పని చేసే నాయకులు కరువయ్యారట. ప్రజా సమస్యలపై గులాబీ నేతలు అంటీ ముట్టనట్లు ఉంటుంటే అటు కాషాయ పార్టీ మాత్రం స్పీడు పెంచింది. రాష్ట్రంలో సంగతి ఎలా ఉన్నా…ఈ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేలా బలపడుతున్నారు, తలపడుతున్నారు. కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్.. నియోజకవవర్గానికి ముఖం చాటేశారట. మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించలేదాయన. కామారెడ్డి మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగురవేసే అవకాశం ఉన్నా.. పట్టించుకోలేదని కార్యకర్తలు కోపంగా ఉన్నారు. ఇక్కడ పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయని గులాబీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి.
పదేళ్ల పాటు బోధన్ ఎమ్మెల్యేగా పనిచేసిన షకీల్.. అజ్ఞాత వాసం వీడటం లేదు. ఓడిపోయాక నియోజకవర్గానికి ఒకటి రెండు సార్లు మాత్రమే వచ్చారాయన. దీంతో… అక్కడ గులాబీ క్యాడర్ హస్తం గూటికి చేరుతోందంటున్నారు. నిజామాబాద్ అర్బన్ లోనూ అదే పరిస్థితి ఉందట. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా కీలక అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జనతా గ్యారేజీ అంటూ నెలకోసారి హడావుడి చేస్తున్నా ఆయన్ను క్యాడర్ పట్టించుకోవడం లేదట. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి బాన్సువాడ, రూరల్ రెండు చోట్లా ఉంటానంటూ ఏ నియోజకవర్గానికి పూర్తి సమయం ఇవ్వడం లేదు. బాన్సువాడ గులాబీ పార్టీకి దిశా నిర్దేశం చేసేందుకు.. లోకల్ లీడర్, బీసీ నేత శ్రీనివాసరావును ఇటీవల పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు ఇంచార్జ్ పదవి ఇచ్చే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు. క్యాడర్ మద్దతు లేకున్నా, ప్రజల ముఖం చూడకున్నా… కేసీఆర్ ఫోటోతో ఎమ్మెల్యేలం ఐపోతామనే ఓవర్ కాన్పిడెన్స్ కారణంగానే చాలా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పుకుంటున్నారు జిల్లాలో. ప్రజా సమస్యలపై.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిత్యం రోడ్డెక్కుతుంటే.. జిల్లా నేతలు మాత్రం కాలు కదపకపోవడం ఏంటని బీఆర్ఎస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని గులాబీ అగ్రనేతలు చెబుతున్నా.. మాజీలు మాత్రం వేచి చూద్దాం అనే ధోరణిలోనే ఉన్నారట. దీంతో జిల్లాలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నయం బీజేపీ అనేలా పరిస్దితులు శరవేగంగా మారుతున్నాయని అంటున్నాయి రాజకీయవర్గాలు.

