OTR: జడ్చర్ల రాజకీయాల్లో రచ్చ.. ఈ పబ్లిసిటీ స్టంట్ వెనుక ఎవరున్నారు..?

  • తరచూ వివాదాస్పద కామెంట్స్‌తో జడ్చర్ల ఎమ్మెల్యే
  • స్వపక్షం, విపక్షం అన్న తేడా లేకుండా దూకుడు వ్యాఖ్యలు
  • అనిరుధ్‌రెడ్డిది వ్యూహమా? నైజమా అన్న అనుమానాలు
  • ఎమ్మెల్యే అయిన కొత్తల్లోనే మాకు చేరికలు వద్దని హాట్ కామెంట్స్‌
  • చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వబోమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
Anirudh Reddy

Anirudh Reddy

OTR: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు జనంపల్లి అనిరుధ్‌రెడ్డి. అయితే… అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సల్‌ కామెంట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారాయన. విషయం ఏదైనా… కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం అలవాటని సర్దిచెప్పుకుంటున్నా… వివాదాలు మాత్రం ఆగడం లేదు. స్వపక్షం, విపక్షం అనే తేడా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే దూకుడుగా చేస్తున్న కామెంట్స్‌ పొలిటికల్‌ కాక రేపుతున్నాయి. పలు సందర్భాల్లో.. ఆయన మాటలు ప్రభుత్వాన్ని, సొంత పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. దీంతో… ఇలాంటి వ్యాఖ్యలు అనిరుధ్‌రెడ్డి వ్యూహంలో భాగమా? లేక అది ఆయన నైజమా అంటూ కూపీలాగే పనిలో బిజీగా ఉన్నారు చాలా మంది. ఎమ్మెల్యేగా గెలిచిన తొలి నాళ్లలోనే… ఇతర పార్టీల నుంచి చేరికలు మాకొద్దని చెప్పి వివాదం రేపారు. అందుకు హస్తం పార్టీ క్యాడర్ శభాష్‌ అన్నా నాయకత్వం ఇరుకునపడిందన్న కామెంట్స్ వినిపించాయి.

ఆ తర్వాత.. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అంగీకరించకుంటే… సీఎం చంద్రబాబును తెలంగాణలో తిరగనివ్వబోమంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. ఇక పారిశ్రామిక వ్యర్ధాలను విచ్చలవిడిగా వదిలితే పరిశ్రమల్ని తగలబెడతానని సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కార్పొరేషన్ ఛైర్మన్స్‌ను రెండేళ్లకు మార్చినట్టు రాష్ట్ర మంత్రులను కూడా రెండేళ్లకు మార్చి విద్యావంతులైన యంగ్ స్టర్స్‌కు ఇవ్వాలని ఇటీవల అన్నారాయన. అక్కడితో ఆగకుండా… రెండు సార్లు గెలిస్తే నేను కూడా సీఎం రేసులో ఉంటానంటూ చేసిన వ్యాఖ్యలు అందరి అటెన్షన్‌ ఆయనవైపు తిరిగేలా చేశాయి. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి 25 కోట్లు కేటాయించాలని చేసిన డిమాండ్… విపక్షాలు సర్కార్‌ను ఇరుకున పెట్టే కంటెంట్‌గా మారిందన్న అభిప్రాయం ఉంది. ఇక ఇప్పపువ్వు సారా ఆరోగ్యానికి మంచిదని, అందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించి న్యూస్ కంటెంట్‌గా మారారు జడ్చర్ల ఎమ్మెల్యే. అదంతా అలా నడుస్తున్న క్రమంలోనే… తాజాగా కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌లోకి ఎంటరై పీసీసీనే ఇరకాటంలోకి నెట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి. తుంగతుర్తి ఎపిసోడ్‌ను దృష్టిలో ఉంచుకుని మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలతోనే గాంధీభవన్‌ ఇబ్బంది పడుతుండగా…. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడలేదని కితాబివ్వడం కాక రేపుతోంది.

రాజగోపాల్‌రెడ్డి అగ్నిపర్వతం, ఆయన కోపం వస్తే బరస్ట్ అవుతారన్న కామెంట్స్ ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. నాకు మంత్రి పదవి కావాలంటూ కోమటిరెడ్డి కొట్లాడలేదు, ప్రజల్లోకి వచ్చి ఇష్యూస్ పై మాట్లాడుతున్నారంటూ అనిరుధ్‌రెడ్డి ఆయనకు సపోర్ట్‌గా నిలవడం కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే… ఒక పధకం ప్రకారమే జడ్చర్ల ఎమ్మెల్యే అలాంటి కామెంట్స్‌ చేస్తున్నారని, ఎప్పటికప్పడు ఘాటు వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారని కూడా అంటున్నాయి కొన్ని వర్గాలు. తన గురువు కోమటిరెడ్డి వెనుకున్నారనే ధైర్యంతోనే అలా మాట్లాడుతున్నారని కొందరు అంటుండగా ….. అనిరుధ్‌రెడ్డి ముక్కుసూటి మనిషి , ఆయన ఏదైనా కుండబద్దలు కొట్టినట్లే మాట్లాడతారంటూ కవర్‌ చేస్తున్నారు సన్నిహితులు. కారణం ఏదైనా… కొన్ని సార్లు పార్టీ, ప్రభుత్వం ఇరుకునపడుతున్నాయన్నది మాత్రం నిజం అంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు.