ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడితే వారికి రక్షణ కల్పిస్తూ, దాడికి గురైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనే అక్రమ కేసులు బనాయించడం ఏ రకమైన న్యాయం? ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలబడితే వారిపై కూడా కేసులు పెడుతూ, ప్రశ్నించిన వారి తలుపులు అర్ధరాత్రి బద్దలుకొట్టి అరెస్టులు చేయడం పోలీసు రాజ్యానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేసి, తలుపులు పగలగొట్టి ఆయనను, ఆయన కుమారుడిని అరెస్టు చేసిన తీరు రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదని స్పష్టం చేస్తోందని జగన్ పేర్కొన్నారు. బాధితుడిని పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేస్తే, ఆ దాడి చేసిన వారిని వదిలేసి ఎమ్మెల్యే విరూపాక్షిపైనే హత్యాయత్నం కేసులు పెట్టడం ఘోరమని అన్నారు. ఈ అరాచకానికి సంబంధించిన దృశ్యాలు బయటకు రాకుండా ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిస్కులను పోలీసులు తీసుకెళ్లడం సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం కాదా? అని ప్రశ్నించారు.
ఇది ఒక్క ఆలూరుకే పరిమితం కాలేదని ఆయన గుర్తుచేశారు. శ్రీకాకుళంలో ఒక రోడ్డు ప్రమాదాన్ని హత్య కేసుగా మార్చి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారని, గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా వ్యాపార వివాదంలో ఉన్న వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తే, ఆయనపైనే కిడ్నాప్ కేసు నమోదు చేశారని ఆరోపించారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్లినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.
నేటి ‘Gen-Z’ తరం డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా, విద్యాదీవెన బకాయిల విడుదల, నిరుద్యోగ భృతి గురించి నిలదీస్తుంటే… సమాధానం చెప్పలేక ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ అరెస్టుల డ్రామాలు ఆడుతోందని జగన్ విమర్శించారు. “చంద్రబాబు గారూ… అధికారం, పోలీసు బలం ఎప్పటికీ శాశ్వతం కావు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అక్రమ కేసులకైనా, అరెస్టులకైనా భయపడేది లేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ అన్యాయాలపై మా పోరాటం తుదివరకు కొనసాగుతుంది” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

