NTV Telugu Site icon

YS Jagan: ఏపీలో మద్యం దుకాణాల వ్యవహారంపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

Ys Jagan

Ys Jagan

YS Jagan: లిక్కర్‌ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్‌ అడ్డాగా మారిపోయిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ ట్వీట్ చేశారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్‌ కాదా అంటూ అడిగారు. మీ మనుషులతో సిండికేట్‌ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. రానున్న ఐదేళ్లలో పెద్దమొత్తంలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీలద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవమే కదా అంటూ పేర్కొన్నారు.

తెచ్చిన లిక్కర్‌ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు బెదిరింపులకు దిగారని ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించిఉంటే అరాచకాలకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. “నీకింత… నాకింత’’ అని కమీషన్ల వాటాలు వేసుకున్న మాట వాస్తవం కాదా? మీరు ఇవన్నీ చేసిన తర్వాత నిర్ణయించిన ధరకే మద్యాన్ని అమ్ముతారా? ఇది ఓ ఫార్స్‌ కాదా? లైసెన్స్‌ ఫీజులతోపాటు కిందనుంచి మీ దాకా కమీషన్లు కోసం, మీవారికి షాపులు ఇవ్వని పక్షంలో బదులుగా వాటాలు సమర్పించడంకోసం లిక్కర్‌ కొనుక్కున్నవారి జేబులు గుల్లచేయడానికి మీరంతా సిద్ధం అయినట్టేకదా? మీకింత వారికింత చొప్పున నచ్చిన రేట్లకు అమ్ముకోవడానికి సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా? దీనివల్ల తమ కుటుంబాల్లో చదువులకోసం, ఇతర బాగోగులకోసం ఖర్చుకావాల్సిన ప్రజల ఆదాయాలను మీ జేబుల్లోకి వేసుకోవడానికి పన్నిన అవినీతి పథకం కాదంటారా చంద్రబాబు?” అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.

కొత్తపాలసీ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రానీయకుండా గండికొట్టారన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్‌ లిక్కర్‌ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 20 డిస్టలరీల్లో 14 మీ హయాంలో వచ్చినవేనన్నారు. వైయస్సార్‌సీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదన్నారు. ఇంకోవైపు ఎమ్మార్పీమీద నియంత్రణ తీసివేసి, మీ వారికి, మీ మాఫియాకు షాపులు అప్పగించి, అక్కడకూడా మీకు ఇంత… నాకు ఇంత అని ఎమ్మార్పీపైన రేట్లు పెంచి వసూలు చేయడం ప్రజల నడ్డి విరగొట్టడం కాదా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. “ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. అమ్మకం వేళలు కూడా నియంత్రణలో ఉంటాయి. దీనివల్ల మద్య నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తైనా పనిచేసినట్టు అవుతుంది. చంద్రబాబుగారూ… ఇప్పుడు మీ విధానం ద్వారా మీ సొంత ఆదాయంకోసం ఆ లక్ష్యానికి తూట్లుపొడిచినట్టే కదా? ఒక ఫక్తు లిక్కర్‌ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు కాని, రాష్ట్రానికి తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు? కారణం ఈ కొత్త పాలసీలో మీ సొంతలాభం ఉండబట్టే కదా?” అంటూ జగన్ అన్నారు.

2014-19 మధ్య ఇదేమాదిరిగా రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారన్నారు. ప్రజల ఆరోగ్యాలను, కుటుంబాల పరిస్థితులను పణంగా పెట్టేలా లిక్కర్‌ పాలసీని తెచ్చి దాని మీద కాసులు ఏరుకున్నారని విమర్శించారు. అప్పట్లో మీ సిండికేట్లు బడిపక్కన, గుడిపక్కన బెల్టుషాపులు పెట్టిమరీ ప్రతి ఇంటికీ డోర్‌డెలివరీ స్థాయికి పరిస్థితులను తీసుకెళ్లాయన్నారు. కాగితాలమీద కనిపించే దుకాణాలే కాకుండా, వాటికి అదనంగా పర్మిట్‌ రూమ్స్‌, దీనికి తోడుగా 43వేల బెల్టుషాపులతో లిక్కర్‌ ఏరులై పారిందన్నారు. వైయస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అలాంటి దారుణ పరిస్థితులను కూకటి వేళ్లతో పెకలించిందన్నారు. మద్యం దళారులకు, అందులోని రాజకీయ వ్యాపారులకు చెక్‌ పెట్టిందన్నారు. దుకాణాల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించి మద్యం అమ్మకాలను నియంత్రించిందన్నారు. అమ్మకాలు కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చేసిందన్నారు. లాభాపేక్షలేనందున పర్మిట్‌రూమ్స్‌, బెల్టుషాపులు.. ఇవన్నీ రద్దు అయ్యాయని వైఎస్ జగన్ అన్నారు.