అమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతి సమేతంగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉగాది వేడుకల సందర్భంగా జగన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ప్రముఖ పండితుడు భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి పరాభవ నామ సంవత్సరానికి సంబంధించిన పంచాంగాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Also Read: Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?
పరాభవ నామ సంవత్సరంలో వైసీపీకి అనుకూల ఫలితాలు ఉంటాయని భాస్కర సుబ్రహ్మణ్య సిద్ధాంతి తెలిపారు. చిన్న ప్రయత్నం చేసినా పెద్ద ఫలితాలు సాధ్యమవుతాయని, ఈ సంవత్సరం పార్టీకి ఒక మంచి పునాది పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అక్కడున్న నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని కలిగించాయి. కార్యక్రమం అనంతరం పండితులు జగన్, భారతి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలు పార్టీ కార్యాలయంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి.