NTV Telugu Site icon

YS Jagan: ఏపీలో ప్రజారోగ్య రంగంపై వైఎస్‌ జగన్ కీలక వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. మరోవంక బిల్లులు చెల్లించకుండా ఆరోగ్య శ్రీని నీరుగారుస్తున్నారని.. తద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తిరిగి ఆస్తులు అమ్ముకునే పరిస్థితిని తీసుకు వస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కావాల్సిన ఐదు మెడికల్‌ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా మీరు నిర్లక్ష్యం చేయడం దీనికి ఇంకో సాక్ష్యంగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది ఆ కాలేజీల్లో తరగతులు ప్రారంభంకాకపోవడం మీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.

Read Also: Ram Mohan Naidu: ఏపీలో నూతన విమానాశ్రయాలు.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి

వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేయడం కోసం అనేక విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. దీంట్లో భాగంగా విలేజ్-వార్డు క్లినిక్స్‌, ఫ్యామిలీ డాక్టర్‌, మండలానికి 2 పీహెచ్‌సీలు, 108,104 సర్వీసులు గణనీయంగా పెంపు, ఆరోగ్యశ్రీ పరిధిలోకి 3,257 చికిత్సలు, చికిత్స కాలంలో కోలుకునేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆరోగ్య ఆసరా, ప్రతి ఇంటిని జల్లెడపడుతూ ఆరోగ్య సురక్ష లాంటి కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా చేపట్టామని మాజీ సీఎం జగన్‌ తెలిపారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు, కొత్త మెడికల్‌ కాలేజీలకోసం రూ.16,880 కోట్లతో పనులు చేపట్టామని, ఇవన్నీ చివరిదశకు వచ్చాయన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్‌ కాలేజీ చొప్పున 17 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని రూ.8,480 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు.

పటిష్టమైన ప్రణాళిక వల్ల 2023-24 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభం అయ్యాయన్నారు. తద్వారా 750 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరంలో మరో ఐదు చోట్ల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని కాలేజీల్లో క్లాసులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్నా మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయారని.. ఇది మీ వైఫల్యంకాదా? అంటూ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఫలితంగా మరో 750 సీట్లు అందుబాటులోకి రాకుండాపోయాయన్నారు. దీంతో పాటు కొత్తకాలేజీల్లో మెడికల్‌ సీట్లన్నింటినీ కూడా కన్వీనర్‌కోటాలో భర్తీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారని విమర్శించారు.

Read Also: BJP: వైసీపీకి మరో షాక్‌.. బీజేపీలో చేరిన కార్పొరేటర్

మెడికల్‌ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేసి, సామాన్యుల నెత్తిన భారం మోపే విధానాల్లోకి వెళ్తున్నారని ఆరోపించారు.. PPPP మోడల్‌ అంటూ ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల నడుపుతున్న వ్యవస్థలా ప్రజారోగ్యరంగాన్ని మార్చేసి సామాన్యుడికి నాణ్యమైన వైద్యం అందుబాటులోలేని పరిస్థితిని తీసుకు వస్తున్నారన్నారు. ఈ విధానాలను ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. ప్రైవేటు సంస్థలకు పోటీగా ప్రభుత్వరంగం ఉన్నప్పుడే, ఆ పోటీ కారణంగా రేట్లు అదుపులో ఉంటాయన్నారు. వెంటనే స్పందించి ఈ సంవత్సరం ఆ 5 కాలేజీల్లో తరగతులు ప్రారంభం అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మేం శరవేగంగా నిర్మించిన కాలేజీలకు మిగిలిన ఆ సొమ్మును కూడా విడుదలచేస్తూ ఈ సంవత్సరం కొన్ని, వచ్చే సంవత్సరం మిగిలిన అన్నీ పూర్తిచేసేదిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. కూటమి మద్దతుపైనే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని.. ఆ పలుకుబడిని వాడుకుని ఆ ఐదు కాలేజీలకు వెంటనే అనుమతులు తీసుకురావాలని కోరుతున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.