AP Crime: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం శాంతినగర్ కు చెందిన యశ్వంత్ రెడ్డి (16) సంవత్సరాల యువకుడిని దారుణంగా హత్య చేశారు.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి రామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొవ్వూరి సందీప్ కాగా చిన్న కుమారుడు యశ్వంత్ రెడ్డి. 25 సంవత్సరాల క్రితం వారి వ్యాపారాల నిమిత్తం నూజివీడుకి వచ్చారు. అమరావతి ఫర్నిచర్స్ హోమ్ నీడ్స్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యశ్వంత్ రెడ్డి రూమ్లో లేకపోవడంతో ఇంటి చుట్టూ వెతికి చూడగా బిల్డింగ్ పైనుంచి కిందికి పడి ఉండటం గమనించారు .
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఇక, యశ్వంత్ రెడ్డి రూమ్ అంతా రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. పచ్చడి నూరే రోలుతో తలపై మోది చంపినట్లు తెలుస్తుంది. ఇక, యశ్వంత్ రెడ్డిని కొట్టిన తర్వాత రూమ్ లో నుంచి బయటకు తీసుకువచ్చి మూడవ ఫ్లోర్ నుంచి కింద పడేసినట్టు రక్తపు మరకలు చూస్తే అర్థం అవుతుందంటున్నారు పోలీసులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ మూర్తి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. అయితే, యశ్వంత్ రెడ్డిని కొట్టి చంపేసింది ఎవరు? అనేది తేల్చే పనిలో పడిపోయారు పోలీసులు.