Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేవారు. మొహర్రం సందర్భంగా ఇకపై వీధి అల్లర్లు జరగడం లేదని చెప్పారు. హత్రాస్లో జరిగిన ఓ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజలు కత్తులతో అల్లర్లు ప్రేరేపిస్తూ హంగామా చేసే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, 2017 నుంచి యూపీలో ఎలాంటి అల్లర్లు జరగలేదని ఆయన అన్నారు.
మెరుగైన భద్రతా వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. 2017కు ముందు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదని చెప్పారు. గతంలో అల్లర్లను ప్రస్తావిస్తూ.. మధురలోని జోహర్ బాగ్ ఘటన, కోసి కలాన్ ఘటన, లేదా ముజఫర్నగర్ అల్లర్లు వంటి సందర్భాలలో నెలల తరబడి కర్ఫ్యూలు విధించారని సీఎం యోగి అన్నారు. దీని వల్ల సాధారణ ప్రజలు, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని చెప్పారు.
మొహర్రం సమయంలో తాజియా పేరుతో పేదవాళ్ల గుడిసెలు కూల్చేవారని, బాల్కనీలు పడగొట్టే వారని, హైటెన్షన్ వైర్లను బలవంతంగా తొలగించే వారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. మొహర్రం సందర్భంగా రాష్ట్రంలో మొత్తదం 12 వేల తాజియా ఊరేగింపులు జరిగినప్పటికీ ఎలాంటి అల్లర్లు, హింసాత్మక ఘటనలు నమోదు కాలేదని సీఎం యోగి అన్నారు.

