ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోనే (CM Jagan) బీసీల అభివృద్ధి సాధ్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) తెలిపారు. విజయవాడలో జరిగిన బీసీ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు.
ఇంత కాలం 50 శాతం పదవుల కోసం కొట్లాడామని.. కానీ సీఎం జగన్ మాత్రం 70 శాతం పదవులు ఇస్తున్నారని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. కర్ణాటక, తమిళనాడులో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు కూడా 50 శాతం కూడా పదవులు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. జగన్ను దేశం మొత్తం కీర్తిస్తోందని.. బీసీలంతా వాస్తవం తెలుసుకోవాలని సూచించారు.
ఎన్నికల ప్రచారంలో ప్రతీ ఇంటికీ తిరిగి బీసీలకు, బలహీన వర్గాలకు జరిగిన మంచిని ప్రచారం చేయాలని ఆయన కోరరు. తమిళనాడు సరిహద్దు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాను, కర్ణాటకలోని బళ్లారిని ఆంధ్రాలో కలపాలని అక్కడి ప్రజలు ధర్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఆంధ్రాలో పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా ప్రజలంతా మరో 20 ఏళ్లలో ధనవంతులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలను ఓటర్లుగా చూస్తుంటే.. జగన్ మాత్రం తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని తెలిపారు. జగన్ ధైర్యశాలి, నీతిమంతుడు.. జగన్ గెలుపు కోసం కాదు.. ఎస్టీ, ఎస్సీ, బీసీల గెలుపు కోసం జగన్ గెలవాలి అని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చాడు.