Vishweshwar Reddy: చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయని ఆయన తెలిపారు. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు పనులు చేయలేదని విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు – నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. హంద్రీనీవా కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.
Also Read: Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించి సీమకు అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమేనని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం లో చంద్రబాబు ఓడిపోతున్నారని.. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.