వికారాబాద్ పట్టణం గంగారం లో దివ్య అనే మహిళ కానిస్టేబుల్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ధారూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న దివ్య అనే కానిస్టేబుల్ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దివ్య ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎవరైనా వేధించారా అనే కోణంలో బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Gandhi-Talks: ఓటిటీలోకి ‘గాంధీ టాక్స్’.. కానీ
అయితే ఆత్మహత్యకు ముందు దివ్య రాసిన లెటర్ గుర్తించారు. ఆ లెటర్ లో నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాసుకొచ్చింది. నాన్న ఉంటే బాగుండు అమ్మ.. నాన్న లేనందుకే నాకు ఇన్ని కష్టాలు. అమ్మ నేను నీకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు అమ్మ అంటూ దివ్య రాసిన లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి అర్థాంతరంగా తనువు చాలించడంతో మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ దివ్య.. హైదరాబాద్ అంబర్ పేట్ లో కానిస్టేబుల్ శిక్షణ పొందింది. ఆరేళ్ల క్రితం తండ్రి మృతి చెందారు. దివ్య తల్లి జగదేవి. పోలీస్ హోంగార్డుగా పని చేసిన తండ్రి బాస్వరాజ్. ఎస్సై కావడానికి ఆసక్తి చూపిన దివ్య. బసవరాజ్ కు ముగ్గురు కూతుర్లు కాగా దివ్య మూడో కూతురు. దివ్య వికారాబాద్ జిల్లా ధారూర్ పోలీస్ స్టేషన్ లో ఐదు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నది. వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర కన్నీరు మున్నీరు అవుతున్నారు దివ్య బ్యాచ్ కు చెందిన మహిళా కానిస్టేబుళ్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ సీఐ రఘు కుమార్ తెలిపారు.