విశాఖ సిటీలో మహిళను నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళకు ఓ వ్యక్తికి మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో ఆమె చనిపోవడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. నిందితుడు జైలు పాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన దాడిలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్య చేశాడు. కన్న కొడుకు కళ్లముందే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. అక్కయ్యపాలెం నందగిరి నగర్లో ఈ ఘటన జరిగింది.
Also Read:UK Work Visa: విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాక్.. వర్క్ వీసా వ్యవధి తగ్గింపు..
శ్రావణ సంధ్యారాణి అలియాస్ సోనూ నందగిరి నగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల వయసు గల కవల కుమారులు ఉన్నారు. ఇద్దరూ మానసిక వైకల్యంతో పుట్టడంతో శ్రావణ సంధ్యారాణి భర్త ఆమెను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై ప్రస్తుతం ఇద్దరి మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. శ్రావణ సంధ్యారాణి తండ్రి విశ్వేశ్వరరావు పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మృతిచెందాడు. తల్లి కూడా కొన్నాళ్ల క్రితం చనిపోయింది. శ్రావణ సంధ్యారాణి ఒక కుమారుడిని హాస్టల్లో చేర్పించగా, మరొక కుమారుడు ఆమెతోనే ఉంటున్నాడు.
శ్రావణ సంధ్యారాణికి, ఆమె ఎదురింట్లో ఉంటున్న కార్పెంటర్ కండిపల్లి శ్రీనివాసరావుకు కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. 8 నెలల క్రితం తాగిన మైకంలో శ్రీనివాసరావు.. సోను స్కూటీ సీటు కవర్ కోసేశాడు. దానితో మొదలైన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి ఎదురు పడినప్పుడల్లా గొడవపడే వాళ్లని స్థానికులు చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో శ్రావణ సంధ్యారాణి వాకింగ్కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది అడుగుల దూరం వెళ్లేసరికి కొండమ్మ అనే మహిళ ఎదురుపడడంతో ఆమెతో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన శ్రీనివాసరావు పదునైన ఆయుధంతో శ్రావణ సంధ్యారాణి పీక కోసేశాడు.
తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది సంధ్యారాణి. ఆమెతో మాట్లాడుతున్న మహిళ ఒక్కసారిగా షాక్ అయి గట్టిగా కేకలు పెట్టింది. స్థానికులు అక్కడకు వచ్చేసరికి శ్రీనివాసరావు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఫోర్త్ టౌన్ సీఐ సీహెచ్ ఉమాకాంత్ అక్కడకు చేరుకుని 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. క్లూస్టీమ్ను రప్పించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
Also Read:Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు
నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు. తనకు సోనుతో పరిచయం ఉందని.. అయితే తాను వేరే మహిళతో చనువుగా ఉండడం పలు మార్లు సోను ప్రశ్నించడం తనకి నచ్చలేదని ఈ నేపథ్యంలోనే గొడవ జరిగిందని పోలీసు ఎదుట చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. అయితే శ్రీనివాస్ చెప్పేది వాస్తవమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సంధ్యారాణికి ఒక సోదరుడు ఉన్నప్పటికీ అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. నా అనేవారు ఎవరూ లేకపోవడంతో బుద్ధిమాంద్యం కలిగిన ఇద్దరు కవలల పరిస్థితి ఏమిటనేది అగమ్యగోచరంగా మారింది. వారిని తండ్రి వద్దకు చేర్చేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.