Site icon NTV Telugu

Killer Wife: ప్రియుడి మోజులో పడి.. భర్తను కడతేర్చేందుకు భార్య కుట్ర.. చివరకు

Wgl Killer Wife

Wgl Killer Wife

డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చేందుకు భార్య పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ప్రియున్ని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన వరంగల్‌లో వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనేవ్యక్తిపై ఆగస్టు 14న రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని హాస్పిటల్‌కి తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది.

Also Read:Kakinada: ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో విషాదం.. కుప్పకూలి యువకుడు మృతి

ఈ సంఘటన వరంగల్ రామన్నపేటలోని రఘునాథ్ కాలనీలో జరిగింది. గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మోత్కులగూడేనికి చెందిన పోతుల సందీప్‌తో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడు సందీప్‌కు తన భర్త రాజుతో స్నేహం చేసి ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసింది.

పద్మ భర్త రాజు.. ప్రయివేట్ చిట్టీలు వేసేవాడు. సందీప్‌తో తన భర్త వద్ద చిట్టీలు వేయించిన పద్మ నిత్యం సందీప్ తన ఇంటికి వచ్చేలా లైన్ క్లియర్ చేసింది. రాజు ఇంట్లోలేని సమయంలో కూడా సందీప్ తరచుగా వచ్చి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని.. ఇరుగు పొరుగు వారి ద్వారా రాజు చెవిన పడింది. దీంతో భార్యను మందలించాడు రాజు. ఈ క్రమంలో హైరానా పడిపోయిన భార్య పద్మ, ప్రియుడు సందీప్‌తో కలిసిభర్త హత్యకు స్కెచ్ వేసింది. ప్రియుడికి కొంత డబ్బు సుపారీగా ఇచ్చి భర్తను అడ్డు తొలగించాలని ప్లాన్ చేసింది. దీంతో తన స్నేహితులతో కలిసి ప్రియుడు సందీప్ ఆగస్ట్ 14న రాజుపై దాడికి పాల్పడ్డాడు. సందీప్‌కు అతని స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్‌ సహకరించారు. విచక్షణా రహితంగా కొట్టి గొంతు నులిమి హత్యాయత్నం చేశారు.

దాడి అనంతరం.. అతడు స్పృహ తప్పి పడిపోవడంతో చనిపోయాడనుకోని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజు చాలా సేపు అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. డంపింగ్ యార్డు వద్ద రాజును గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఫలితంగా ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగిన వెంటనే పద్మ.. రాజును చంపారనుకుని.. వెంటనే సందీప్‌కు రూ.3 లక్షలు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:Mumbai Monorail Breaks Down: ముంబైలో రెండు ముక్కలైన మోనోరైలు.. ఇరుక్కుపోయిన 100 మంది!

అయితే.. రాజు బతికి ఉన్నాడనే విషయం తెలుసుకున్న పద్మ.. అదే రాత్రి ఇంటిలో ఉన్న మరో 6 లక్షల రూపాయలు తీసుకుని సందీప్‌తో వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సందీప్, పద్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి వద్ద 5 లక్షల 40 వేల రూపాయల నగదు.. ఓ కారు, రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం కోసం తాపత్రయ పడ్డ పద్మ.. అసలుకే ఎసరు వస్తుందని ఊహించలేదు. భర్తను అడ్డు తొలగించుకోవాలన్న పథకం బెడిసి కొట్టడంతో కటకటాలపాలైంది.

Exit mobile version