Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explained: బెంగాల్ అంటేనే మేధావుల ఇలాకా… లౌకికవాదం, లెఫ్ట్ భావజాలం, కళలు, సాహిత్యానికి మారుపేరు. అలాంటి గడ్డపై బీజేపీ అడుగుపెట్టడమే కష్టమనుకున్న తరుణంలో ఊహించని విధంగా ఆ పార్టీ జెండా పాతింది. మొన్నటివరకు తృణమూల్ కాంగ్రెస్ (TMC) కంచుకోటగా ఉన్న పశ్చిమ బెంగాల్లో, 294 స్థానాలకు గానూ ఏకంగా 208 సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ప్రభంజనం సృష్టించింది. కేవలం 80 స్థానాలకే పరిమితమైన మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని కూల్చడంలో బెంగాలీ సమాజంలో అత్యంత కీలకమైన ‘భద్రలోక్’ (విద్యావంతులు, ఉన్నత శ్రేణి మధ్యతరగతి వర్గం) పోషించిన పాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కోల్కతా పరిసరాల్లోని ప్రెసిడెన్సీ రీజియన్ అంటే భద్రలోక్ల అడ్డా. అలాంటి ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో నాలుగింటిని బీజేపీ గెలుచుకోవడం, రాష్బెహారీ లాంటి ప్రతిష్టాత్మక స్థానంలో బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్గుప్తా విజయం సాధించడం బెంగాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. నిన్నటివరకు హిందుత్వ రాజకీయాలకు ఆమడదూరంలో ఉన్న ఈ వర్గం, హఠాత్తుగా కాషాయ జెండా వైపు ఎందుకు మొగ్గు చూపిందనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
కీలకంగా మారిన ‘భద్రలోక్’ వర్గం..
బ్రిటిష్ కాలంలో శాశ్వత భూవసతి చట్టం ద్వారా పుట్టుకొచ్చిన ఈ ‘భద్రలోక్’ వర్గం, ఆ తర్వాత ఇంగ్లీష్ చదువులతో ఆధునిక సమాజంగా ఎదిగి బెంగాల్ సంస్కృతిని, రాజకీయాలను శాసిస్తూ వచ్చింది. స్వాతంత్ర్యానికి ముందు నుంచి కాంగ్రెస్ లౌకికవాదం వైపు, ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు లెఫ్ట్ పార్టీల కల్చరల్ మార్క్సిజం వైపు నిలిచిన ఈ మేధావి వర్గానికి మమతా బెనర్జీ రూపంలో ఒక సబ్ ఆల్టర్న్ (సమాజంలోని దిగువ శ్రేణి) టచ్ ఉన్న ప్రత్యామ్నాయం దొరికింది. అయితే, బీజేపీ హిందుత్వ ఎజెండాను, ఆ పార్టీని బెంగాల్ గడ్డకు పరాయిదానిగా చూస్తూ వచ్చిన ఈ సగటు మధ్యతరగతి సమాజం, ఇప్పుడు అదే పార్టీని నెత్తిన పెట్టుకోవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వంపై పేరుకుపోయిన తీవ్ర ప్రజా వ్యతిరేకతే.
Also Read
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ఈ మార్పు వెనుక బలమైన ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు పారిశ్రామికంగా వర్ధిల్లిన బెంగాల్, గత 15 ఏళ్ల టీఎంసీ పాలనలో నిరుద్యోగానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. జాతీయ స్థాయితో పోలిస్తే ఇక్కడ పారిశ్రామిక వృద్ధి రేటు దారుణంగా పడిపోయింది, తలసరి ఆదాయం క్షీణించింది. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో చదువుకున్న బెంగాలీ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. “బెంగాల్ ఒక వృద్ధాశ్రమంగా మారుతోంది” అనే ఆవేదన అక్కడి యువతలో గూడుకట్టుకుంది. ఈ నిరాశ, నిస్పృహల నుంచే మార్పు కావాలనే గళం వినపడింది. దీనికి తోడు రాజకీయంగా భద్రలోక్ వర్గాన్ని టీఎంసీ దూరం పెడుతూ వచ్చింది. 2011లో సర్వీస్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు 45 శాతం సీట్లు ఇచ్చిన టీఎంసీ, 2021 నాటికి దాన్ని 34 శాతానికి తగ్గించేసింది. చదువుకున్న మేధావుల స్థానంలో స్థానిక వ్యాపారులు, అనుబ్రత మోండల్, షేక్ షాజహాన్ లాంటి వివాదాస్పద ‘స్ట్రాంగ్మెన్’ (బలవంతులు) చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఆస్తుల విలువ కోట్లల్లోకి పెరిగింది కానీ, సాధారణ భద్రలోక్ వర్గానికి రాజకీయ ప్రాధాన్యత దక్కకుండా పోయింది.
ఈ రాజకీయ శూన్యతను బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వాడుకుంది. గతంలో దూకుడుగా మాట్లాడే దిలీప్ ఘోష్ స్థానంలో, బెంగాలీ నాటకాలు, కవిత్వాన్ని ప్రేమించే కోల్కతా మేధావి సమీక్ భట్టాచార్యను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. శరద్వత్ ముఖర్జీ లాంటి విద్యావంతులకు టికెట్లు ఇచ్చి భద్రలోక్ వర్గానికి దగ్గరైంది. ఇవన్నీ ఒకెత్తయితే, కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఉదంతం మమతా ప్రభుత్వ శవపేటికలో చివరి మేకుగా మారింది. ‘రాత్ దొఖోల్’ (నైట్ రీక్లెయిమ్) పేరుతో లక్షలాది మంది మహిళలు, మేధావులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అంతకుముందు టీఎంసీ నేతల ఇళ్లల్లో బయటపడ్డ నోట్ల కట్టలు, అవినీతి స్కామ్లు చూసి విసిగిపోయిన ప్రజలకు, ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. మమతా బెనర్జీకి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న మహిళలే ఆమెకు పూర్తిగా దూరమయ్యారు.
హిందుత్వం బెంగాల్కు కొత్త కాదు..
నిజానికి బెంగాల్కు హిందుత్వ కొత్తేమీ కాదు. 19వ శతాబ్దంలో చంద్రనాథ్ బసు తన పుస్తకంలో ‘హిందుత్వ’ అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది ఇక్కడే. బంకిం చంద్ర ఛటర్జీ రచనలు, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు సైతం బెంగాల్లోనే పుట్టాయి. అయితే స్వాతంత్ర్యం తర్వాత ఆర్థికాంశాల చుట్టూ తిరిగిన బెంగాల్ రాజకీయాలను, 2009 తర్వాత ముస్లిం ఓట్ల కోసం మమతా బెనర్జీ మతపరమైన గుర్తింపు రాజకీయాల వైపు మళ్లించారు. ఆ రూట్లోనే బీజేపీ దూసుకుకొచ్చింది. దేశ విభజన నాటి ‘గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్’, ‘నోఖాలీ అల్లర్లు’ వంటి చారిత్రక గాయాలను, బంగ్లాదేశ్ చొరబాట్ల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను ప్రస్తావిస్తూ బీజేపీ చేసిన ప్రచారం, భద్రలోక్లోని ఉదారవాద ముసుగును తొలగించి హిందూ పునరుజ్జీవనం వైపు అడుగులు వేయించింది. ముఖ్యంగా ఉదారవాద కాలం తర్వాత పుట్టిన కొత్త తరం భద్రలోక్ యువతకు పాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో సంబంధం లేదు. వారికి కావలసింది పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి.
RSS బ్యాగ్రౌండ్ వర్క్..
ఈ గెలుపు వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) క్షేత్రస్థాయిలో చేసిన నిశ్శబ్ద విప్లవం ఉంది. పెద్ద పెద్ద సభలు కాకుండా… స్థానిక టీ కొట్లు, బ్యూటీ పార్లర్లు, హౌసింగ్ సొసైటీలు, ఆటో డ్రైవర్ల ద్వారా ఆర్ఎస్ఎస్ లక్షలాది మైక్రో మీటింగ్స్ నిర్వహించింది. చొరబాట్లు, తుష్టీకరణ (అప్పీజ్మెంట్) రాజకీయాల గురించి కేవలం ఒకట్రెండు మాటలతోనే ప్రజల్లో ఆలోచన రేకెత్తించారు. వేలాది వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారాన్ని హోరెత్తించారు. చివరికి టీఎంసీ కేడర్లోకి సైతం ఆర్ఎస్ఎస్ శ్రేణులు చొరబడ్డాయి. ఈ విధంగా ఆర్థిక సంక్షోభం, పెచ్చుమీరిన అవినీతి, అరాచక రాజకీయాలు, సాంస్కృతిక గుర్తింపు భయం… వీటన్నింటి కలయికే బెంగాలీ భద్రలోక్ను లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు నడిపించి, బెంగాల్పై కాషాయ జెండా ఎగిరేలా చేసింది.
తాజావార్తలు
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!