రాష్ట్రంలో ఖాళీగా వున్న ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.డిఎస్సి నోటిఫికేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు..అధికారంలోకి రాగానే ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ గారు ప్రకటించారు..కానీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే నాలుగేళ్లు గడిచి పోయింది.గడిచిన ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ను కూడా విడుదల చేయలేదు.డి.ఎడ్, బి.ఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు..ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉపాధ్యాయ పోస్టులు కేవలం 717 మాత్రమే ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శాసనమండలిలో సమాధానం చెప్పిన విషయం తెలిసిందే.. కేంద్రానికి మాత్రం రాష్ట్రంలో సుమారు 50వేల పై చిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ నివేదిక ను పంపింది.
రాష్ట్రంలో సుమారు 14వేల వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా ఉన్నాయి. ఒక్క టీచరే అన్ని తరగతులకూ బోధించడం ఉపాధ్యాయులకు ఎంతో భారంగా మారింది. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కనుక సెలవు పెడితే ఇక ఆ రోజు బడిని మూసివేయాల్సిందే మరీ.నెలరోజుల క్రితం మెగా డిఎస్సి ని త్వరలో విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ గారు పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం జూలై లేదా ఆగస్టు నాటికీ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు సేకరించి డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని మంత్రి బొత్స సత్యన్నారాయణ గారు తెలిపారు.. ప్రతి ఏటా నిర్వహించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా ప్రభుత్వం నిర్వహించ లేదు. గత ప్రభుత్వం 2018 న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక ఆ తరువాత మళ్ళీ 2022లో మాత్రమే టెట్ ను నిర్వహించారు.. పాఠశాల విద్యాశాఖ 2022లో నిర్వహించిన టెట్కు 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 4,07,329 మంది హాజరయ్యారు. వీరిలో 58.07 శాతం మంది టెట్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. టెట్ ను నిర్వహించి ఏడాది పూర్తి అవుతున్న నోటిఫికేషన్ ఇంకా రాలేదు అని అభ్యర్థులు దిగులు పడుతున్నారు. మంత్రి గారు తెలిపినట్లు గా రానున్న ఆగష్టు నెల నాటికీ అయిన నోటిఫికేషన్ ను విడుదల చేస్తారో లేదో చూడాలి.