ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి యోజన (Pradhan Mantri Vidyalaxmi Scheme) భారత కేంద్ర ప్రభుత్వం (ఉన్నత విద్యా శాఖ) 2024 నవంబర్ 6న ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల ఉన్నత విద్యను కోల్పోకుండా సహాయం చేస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే , ఈ పోర్టల్ ద్వారా 3.31 లక్షలకు పైగా విద్యా రుణ దరఖాస్తులు ఆమోదం పొందగా, వాటిలో రూ. 7,229.4 కోట్లు పంపిణీ చేయబడ్డాయి.
విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, మొదటి సంవత్సరంలో ఫిబ్రవరి 24 వరకు అందిన 6,51,974 దరఖాస్తులలో 3,31,089 దరఖాస్తులు ఆమోదం పొందాయి. ఈ పథకం NEP 2020కు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ఏటా 22 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. రుణం మొత్తం రూ.10 లక్షల వరకు (అవసరమైతే ఎక్కువ కూడా, కానీ సబ్సిడీ రూ.10 లక్షల వరకే). ట్యూషన్ ఫీజు, హాస్టల్, బుక్స్, ల్యాప్టాప్, లివింగ్ ఖర్చులు అన్నీ కవర్ అవుతాయి. మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు, విదేశీ ఇన్స్టిట్యూషన్లు ఎలిజిబుల్ కావు.
పీఎం-విద్యా లక్ష్మి యోజన అంటే ఏమిటి?
ప్రధానమంత్రి-విద్యా లక్ష్మి యోజన, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (NIRF) కింద ర్యాంక్ పొందిన నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో (QHEIs) మెరిట్ ఆధారంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు హామీదారులు లేకుండా రుణాలను అందిస్తుంది. ఈ పథకం కింద, రూ.8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు రూ.10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీకి కూడా అర్హులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించిన ఈ పథకం, దేశంలోని 860 అగ్రశ్రేణి విద్యాసంస్థలలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా రుణ సహాయాన్ని అందిస్తుంది. రూ.3,600 కోట్ల బడ్జెట్తో (2024–2031), ఈ పథకం ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ పథకం పారదర్శకమైన, వేగవంతమైన ప్రక్రియకు హామీ ఇస్తుంది.
వడ్డీపై రాయితీ
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద, వార్షిక కుటుంబ ఆదాయం రూ. 4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు పూర్తి వడ్డీ రాయితీ (100%) లభిస్తుంది.
వార్షిక ఆదాయం రూ. 4.5-8 లక్షల మధ్య ఉన్న విద్యార్థులు రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3% వడ్డీ రాయితీని పొందుతారు.
రూ. 7.5 లక్షల వరకు రుణాలపై ప్రభుత్వం 75% రుణ హామీని అందిస్తుంది.
Also Read:Gopichand: ఆగిందనుకున్న సినిమా మళ్ళీ మొదలైంది
ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రధానమంత్రి విద్యాలక్ష్మి యోజన కింద విద్యా రుణం పొందడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు pmvidyalaxmi.co.in అనే PM విద్యాలక్ష్మి పోర్టల్ను సందర్శించడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం అన్ని ప్రధాన బ్యాంకులతో అనుసంధానించబడింది. ముఖ్యంగా, వడ్డీ రాయితీ మొత్తం ఈ-వోచర్ లేదా CBDC వాలెట్ ద్వారా నేరుగా లబ్ధిదారునికి అందిస్తారు.