ప్రస్తుతం ఇంట్లోని వంటగది నుంచి ఐటీ కారిడార్ల క్యాంటీన్ల వరకు ఎక్కడ చూసినా ‘వంట గ్యాస్’ చర్చే నడుస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇంధన సరఫరాను దెబ్బతీస్తుంటే.. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరత సామాన్యుడి జీవన ప్రమాణాలను అతలాకుతలం చేస్తోంది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య వరంగల్లో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అమెరికా, ఇజ్రాయెల్.. ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగడంతో భారత్లో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్ల కొరత ఏర్పడింది. గ్రామాల్లో ప్రజలు ముందస్తుగానే సిలిండర్లను బుక్ చేసుకుని నిల్వ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గ్యాస్ ధరలు పెరగడం, స్టాక్ లేకపోవడంతో సామాన్యులతో పాటు పెద్ద పెద్ద హోటల్ యజమానులు కూడా విలవిలలాడుతున్నారు.
Also Read:Work From Home: వంట గ్యాస్ ఎఫెక్ట్.. ఉద్యోగస్థులకు వర్క్ ఫ్రం హోం ఆఫర్ చేసిన టాప్ టెక్ దిగ్గజం..
గ్యాస్ విలువ ఇంతలా పెరిగిన తరుణంలో.. వరంగల్ మున్సిపల్ సిబ్బంది చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నగరంలో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించడంతో.. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రంగంలోకి దిగారు. కాశిబుగ్గ ప్రాంతంలో పన్ను చెల్లించలేదన్న నెపంతో ఓ ఇంటి యజమాని ఇంట్లోని గ్యాస్ సిలిండర్ను అధికారులు తీసుకెళ్లడం విస్మయానికి గురిచేసింది.
Also Read:Half Day Schools: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. ఒంటిపూట బడులు వచ్చేశాయ్.. ఎప్పటి నుంచంటే..
ఈ ఘటనకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ కావడంతో అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ‘లక్షల రూపాయల పన్ను బకాయిలు ఉన్న బడా బాబుల జోలికి వెళ్లని అధికారులు, పూట గడవని పేదవాడి వంటగదిలో సిలిండర్ను ఎలా తీసుకెళ్తారు?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ కొరతతో జనం అల్లాడుతుంటే.. ఉన్న ఒక్క సిలిండర్ను ఇలా సీజ్ చేయడం ఎంత మాత్రమూ తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ఇంటి పన్ను చెల్లించిన తర్వాత సిబ్బంది ఆ గ్యాస్ బండను ఇంటి యజమానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడే కాకుండా.. పోచమ్మమైదాన్ ఏరియాలో కూడా పన్ను చెల్లించని కారణంగా ఓ ఇంటి నుంచి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తానికి అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం వంటగదిని చేరుతుంటే.. స్థానిక అధికారుల అత్యుత్సాహం సామాన్యుడి కడుపు కొడుతోంది. పన్ను వసూళ్లలో పారదర్శకత ఉండాలి కానీ.. అది పేదలపై వేధింపుగా మారకూడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.