Vietnam Boat Tragedy: నేడు భారత్‌కు 15 మంది భారతీయుల మృతదేహాలు.!

Vietnam

Vietnam

Vietnam Boat Tragedy: వియత్నాంలో శనివారం జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 15 మంది భారతీయుల మృతదేహాలు సోమవారం స్వదేశానికి చేరుకోనున్నాయి. హో చి మిన్ సిటీ నుంచి వియత్నాం ఎయిర్‌లైన్స్‌కు చెందిన VN979 విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నట్లు హనోయ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9:35 గంటలకు ఈ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది. అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన భారత రాయబార కార్యాలయం.. వారికి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. బాధిత కుటుంబాలతో సమన్వయం కొనసాగించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 10 మంది తమిళనాడుకు చెందినవారు, ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు, ఇద్దరు కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు. మరోవైపు, ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు పర్యాటకులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు.

వియత్నాం మీడియా కథనాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ఫు క్వాక్ ద్వీపకల్పం సమీపంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ‘ఓషన్ పెర్ల్ ఐలాండ్’ సంస్థకు చెందిన స్పీడ్‌బోట్ 36 మంది ప్రయాణికులతో ‘హాన్ మే రట్’ దీవి నుంచి ‘అన్ థోయ్’ రేవుకు వెళ్తుండగా సముద్రంలో ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది భారతీయులు మృతి చెందగా.. పలువురు గాయాలతో బయటపడ్డారు.