Vasireddy Padma: మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. అయితే, ఈ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసింది ఏపీ మహిళా కమిషన్.. మంత్రి రోజాపై జుగుప్సాకరంగా మాట్లాడిన బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి రాసిన లేఖలో కోరారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ..
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు వాసిరెడ్డి పద్మ.. శనివారం డీజీపీకి లేఖ రాస్తూ.. బండారు మాట్లాడిన నీచమైన భాష జుగుప్సాకరంగా ఉందని పేర్కొన్నారు. ఒక మంత్రిపై రాజకీయాల్లో ఉన్న మహిళా నేతపై ప్రెస్ మీట్ లు పెట్టి మరీ.. బండబూతులు మాట్లాడుతున్నారని.. వీటిని ఎంత మాత్రం సహించరాదని పేర్కొన్న ఆమె.. వెంటనే కేసు నమోదు చేసి.. తక్షణం అరెస్టు చేయాలని డీజీపికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు మహిళా నేతలు, న్యాయవాదులు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు వాసిరెడ్డి పద్మ. బండారు వంటి మహిళా వ్యతిరేకులకు తగిన గుణపాఠం చెప్పాలని.. అతని వ్యాఖ్యలపై అందరూ సీరియస్ గా స్పందించాలని కోరారు.. మంత్రులుగా ఉన్న మహిళల పట్ల కూడా క్రూరంగా వ్యవహరిస్తున్న బండారు సత్యనారాయణ వంటి మాజీ మంత్రుల బండారాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకెళ్తూ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు.