UWW suspends Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (యూడబ్ల్యూడబ్ల్యూ) పూనియాపై సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన పూనియాపై తాజాగా యూడబ్ల్యూడబ్ల్యూ చర్యలు తీసుకుంది. పూనియాపై యూడబ్ల్యూడబ్ల్యూ ఏడాది నిషేధం విధించింది. 2024 చివరి వరకూ అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదు. దాంతో ప్యారిస్ ఒలింపిక్స్లో పతకం గెలవాలనుకున్న అతడి కల చెదిరింది.
డోప్ టెస్ట్కు నిరాకరించాడన్న కారణంగా భజ్రంగ్ పూనియాను ఏప్రిల్ 23న నాడా సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్పై పూనియా ఆ సమయంలోనే స్పందించాడు. తాను శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించలేదని, శాంపిల్ తీసుకునేందుకు నాడా అధికారులు గడువు ముగిసిన కిట్ను ఉప్పగించినందుకు వివరణ అడిగానని తెలిపాడు. ఇక యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తాజాగా పేర్కొన్నాడు. పూనియా స్టేట్మెంట్పై స్పందించిన యూడబ్ల్యూడబ్ల్యూ.. సస్పెండ్ చేస్తున్న విషయాన్ని కారణాలతో సహా అతని ప్రొఫైల్లో పేర్కొన్నామని చెప్పింది.
Also Read: KL Rahul: లక్నో కెప్టెన్గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్ కూడా కష్టమే!
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో మెరిసిన భజ్రంగ్ పూనియా.. ప్యారిస్ ఒలింపిక్స్లోనూ పతకం గెలుస్తాడని అంతా అనుకున్నారు. ఒలింపిక్స్ కోసం అతడు సన్నద్ధమయ్యాడు. విదేశాల్లో శిక్షణ కోసం పూనియాకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రూ. 9 లక్షలు మంజూరు చేసింది. ఇంతలోనే యూడబ్ల్యూడబ్ల్యూ షాక్ ఇచ్చింది. ఈ పరిణామంతో పూనియా కల చెదిరింది.