కొత్త నీరు వస్తే.. పాత నీరు పోతుందంటారు. కానీ అక్కడ మాత్రం ఏ నీరు ఏదో కూడా అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయట. నేను పక్కా లోకల్ అని ఒకరు, నేనూ లోకవేనని మరొకరు…. ఇద్దరు మాజీ మంత్రులు కీచులాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో వైసీపీ అధిష్టానం చేసిన ప్రయోగాలు వికటించే ఈ పరిస్థితి వచ్చిందా? ఎవరా ఇద్దరు మాజీలు? ఉత్కంఠ పోరులో ఎవరిది పైచేయి అవుతుంది?
Also Read:OFF THE RECORD: మున్సిపల్ ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అంతా… అవసరానికి తగ్గట్టు అతికించుకుంటూ పోవడాలే. కొన్ని సార్లు సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే… చివరకు ఊరు వాడ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రుల పరిస్థితి అదే. అలా ఖాళీ చేసి వెళ్ళడమే ఇప్పుడు ఇద్దరి మధ్య వివాదానికి కారణమైంది. పెనుకొండ కేంద్రంగా వైసీపీలో మొదలైన ఆధిపత్య పోరు పీక్స్కు చేరుకుంది. వైసీపీ ఆవిర్భావం నుంచి పెనుకొండలో పార్టీ లీడర్గా ఉన్నారు శంకర నారాయణ. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒకసారి ఓడిపోయినా… 2019ఎన్నికల్లో భారీ విజయం సాధించి మంత్రి కూడా అయ్యారాయన.
తర్వాత సొంత నేతలే ఆయనతో విబేధించడంవల్ల పెనుకొండ నుంచి తప్పించి అనంతపురం లోక్సభ నియోజకవర్గానికి పంపింది వైసీపీ అధిష్టానం. ఇష్టం లేకపోయినా అధిష్టానం మాట మీర లేక అక్కడ పోటీ చేసి ఓడిపోయారు శంకర నారాయణ. ఇక మరో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ గతంలో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కించుకున్నారామె. అయితే… 2024 ఎన్నికల్లో ఆమెను కళ్యాణదుర్గం నుంచి తప్పించి.. పెనుకొండ పంపారు పార్టీ పెద్దలు. ఉష రాకను శంకర్ నారాయణ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే… ఆమె మొండిగా వెళ్లి అక్కడ పాతుకుపోయారు. కానీ… ఎన్నికల్లో మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓటమి చవి చూడాల్సి వచ్చింది.
ఆ విధంగా…గత ఎన్నికల్లో అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రయోగాలే ప్రస్తుతం ఈ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య విబేధాలు సృష్టించాయి. అనంతపురంలో ఓటమి తర్వాత శంకర్ నారాయణ తిరిగి తన సొంత నియోజకవర్గానికి రాగా…. ఉషా ఇక్కడి నుంచి కళ్యాణదుర్గం వెళ్ళిపోయారు. కానీ…. అప్పటికే అక్కడ సీనియర్ లీడర్ తలారి రంగయ్య ఉండటంతో బౌన్స్ బ్యాక్ అయ్యారామె. నేను రివర్స్ వచ్చినట్టే… నువ్వు కూడా అనంతపురం లోక్సభ సీటుకు వెళ్ళిపొమ్మని అనడం, నేను ఎక్కడికీ వెళ్ళేది లేదని శంకర నారాయణ చెప్పడంతో వివాదం మొదలైంది. అయితే అప్పటికే పెనుకొండలో బలంగా పాతుకుపోయిన ఉషాశ్రీచరణ్…. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి మీద వేటు పడేలా చేయగలిగారు.
దీంతో శంకర్ నారాయణ సైలెంట్ అయ్యారు. నిన్నటి వరకు ఆయన ఇటు పెనుకొండ అటు అనంతపురంలో ఎక్కడా యాక్టివ్గా కనిపించ లేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా వాయిస్ పెంచిన ఉషా శ్రీచరణ్…. శంకర్ నారాయణను పెనుకొండ నుంచి ఖాళీ చేయించాల్సిందేనంటూ పట్టుబడుతున్నారట. అసలు ఎందుకిలా ఆమె డిమాండ్ చేస్తున్నారంటే.. గడిచిన ఎన్నికల్లో అధిష్టానం చెప్పిందని.. కళ్యాణదుర్గంలోని తన సొంత ఇంటిని, సామ్రాజ్యాన్ని వదిలేసి మొత్తం సర్దుకుని పెనుకొండకు వచ్చానని, ఇక ప్రత్యామ్నాయం లేదని అంటున్నారట. తనలాగే…. అనంతపురం వెళ్లాల్సిన నాయకుడు ఇక్కడే పాతుకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. పైగా నియోజకవర్గంలో తాను పార్టీని బలోపేతం చేస్తుంటే.. ఆయన మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారని చెబుతున్నారట.
Also Read:Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!
అందుకే శంకరనారాయణ కూడా తట్టబుట్ట సర్దుకుని ఖాళీ చేయాల్సిందేనన్నది ఉషశ్రీచరణ్ డిమాండ్. ఇదే అంశాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారట. అయితే శంకర్ నారాయణ మాత్రం తాను కదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి తాను ఇక్కడే ఉన్నానని, గత ఎన్నికల్లో అధిష్టానం చెప్పిందని.. కాదనలేక వెళ్లాను తప్ప.. ఇక్కడ ఖాళీ చేసే ఉద్దేశ్యం లేదని అంటున్నట్టు తెలిసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే శంకర్ నారాయణ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారినట్టుందని అంటున్నారు పరిశీలకులు. అటు ఆయన సొంతూరు ధర్మవరం అయితే అక్కడ అడుగుపెట్టనివ్వరు. దశాబ్ధన్నరగా తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్న పెనుకొండలోనూ ఉషాశ్రీ రానివ్వడం లేదు. దీంతో… శంకర్ నాయణ తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న ఆసక్తి పెరుగుతోంది. పెనుకొండ మీద ఆన అంటున్న ఇద్దరిలో ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి.