దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది.
అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీస్ స్క్రీనింగ్ పరీక్షలు వాయిదా వేసింది. గతంలో వేర్వేరుగా ప్రకటించిన రెండు నోటిఫికేషన్ల ప్రకారం.. ప్రిలిమినరీ పరీక్ష మే 26న జరగాల్సి ఉంది. అయితే లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ రెండు పరీక్షలను జూన్ 16న ఈ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు యూపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
సివిల్ సర్వీసెస్లో 1,056 ఉద్యోగాలు, ఫారెస్ట్ సర్వీసుల్లో 150 పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుల గడువు మార్చి 6తో ముగిసింది. యూపీఎస్సీ మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా షెడ్యూల్ను యూపీఎస్సీ మార్పు చేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ఎన్నికల నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.