మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. దేశం మొత్తం మహా రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే, పార్టీపై పట్టు కోల్పోకుండా అడుగులు వేస్తున్నారు. శివసేన పార్టీకి సంబంధించి మొత్తం 56 ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 38 మంది ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే రెబెల్ గ్రూప్ లో ఉన్నారు.
ఇదిలా ఉంటే వరసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే. శుక్రవారం సేన జిల్లా అధ్యక్షులతో సమావేశం అయిన ఉద్ధవ్ ఠాక్రే, శనివారం ముంబైలోని సేన భవన్ లో పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాలా సాహెబ్ ఠాక్రే పేరు ఎందుకు వాడాలనుకుంటున్నారని.. వారికి దమ్ము ఉంటే తన తండ్రి పేరు మీద ఓట్లు అడగాలని.. ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దామని రెబెల్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు ఉద్ధవ్ ఠాక్రే. కొంతమంది తనను ఏదో ఒకటి చెప్పాలని అడుగుతున్నారని.. రెబెల్ ఎమ్మెల్యేలు ఏం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చని.. నేను వారి విషయాల్లో జోక్యం చేసుకోనని అన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలు సొంత నిర్ణయం తీసుకోవచ్చు.. కానీ ఎవరూ కూడా బాల్ ఠాక్రే పేరును ఉపయోగించకూడదని ఉద్ధవ్ ఠాక్రే శివసేన జాతీయ కార్యవర్గం సమావేశంలో అన్నారు.
అసమ్మతి వర్గం కొత్త గ్రూప్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ పేరు లేదా బాలా సాహెబ్ ఠాక్రే పేరును ఎవరూ ఉపయోగించకూడదన్న తీర్మాణాన్ని ఆమోదించారు. శివసేన పార్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు ఉద్ధవ్ ఠాక్రే ఉందని.. శివసేన పార్టీ పేరు, బాలా సాహెబ్ ఠాక్రే పేరు ఉపయోగించ కూడదని.. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై చర్యలు వంటి తీర్మాణాలను సమావేశంలో ఆమోదించారు.