యూఏఈ , ఇరాన్ మధ్య ఉన్న అతిపెద్ద బంధం వాణిజ్యం. ఇరాన్కు యూఏఈ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఏటా వీరి మధ్య సుమారు 25 నుంచి 27 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంది. పాశ్చాత్య దేశాలు ఇరాన్పై ఆంక్షలు విధించిన సమయంలో.. ప్రపంచ దేశాలతో వ్యాపారం చేయడానికి దుబాయ్ రేవులే ఇరాన్కు ప్రధాన మార్గంగా నిలిచాయి. అలాగే, యూఏఈలో దాదాపు 5 లక్షల మంది ఇరానీయులు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా వీరు అక్కడి ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యారు. ఈ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా, యుద్ధం అనేది ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తుంది.
1971లో యూఏఈ ఆవిర్భవించినప్పటి నుంచి అబు మూసా, గ్రేటర్ టన్బ్, లెసెర్ టన్బ్ అనే మూడు ద్వీపాల విషయంలో ఇరు దేశాల మధ్య వివాదం నడుస్తోంది. ఇవి పరిమాణంలో చిన్నవైనప్పటికీ, హోర్ముజ్ జలసంధి ప్రవేశ ద్వారంలో ఉండటం వల్ల వీటికి అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంపై పట్టు కోసం ఇరాన్ వీటిని తన ఆధీనంలో ఉంచుకుంది. యూఏఈ తన సైనిక శక్తి కంటే దౌత్యపరమైన మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోంది.
Also Read:DC Vs MI: టాస్ గెలిచిన డిల్లీ.. MI బ్యాటింగ్.. తుది జట్లు ఇవే..
ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణం యూఏఈలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. అల్ దఫ్రా ఎయిర్ బేస్ మరియు జెబల్ అలీ పోర్ట్ అమెరికా నౌకాదళానికి కీలక కేంద్రాలు. వీటికి తోడు, అబ్రహం ఒప్పందం ద్వారా యూఏఈ ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడం ఇరాన్కు మింగుడుపడలేదు. ఇజ్రాయెల్ ఉనికి తన సరిహద్దుల వరకు రావడంపై ఇరాన్ ఆందోళన చెందుతోంది. అందుకే ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధంలో భాగంగా దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జ్ అల్-అరబ్ వంటి కీలక ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఇప్పటి వరకు యూఏఈపై ఇరాన్ 450 క్షిపణి, 2500 డ్రోన్లతో దాడి చేసింది.
యూఏఈ వైశాల్యం చిన్నది.. దాని జనాభాలో 80 శాతానికి పైగా విదేశీయులే . యుద్ధం సంభవిస్తే విదేశీ పెట్టుబడులు తగ్గిపోవడమే కాకుండా.. పర్యాటక రంగం దెబ్బతింటుంది. అందుకే యూఏఈ నేరుగా యుద్ధంలోకి దిగకుండా ‘నిగ్రహాన్ని’ పాటిస్తోంది. అయితే, హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం తెరిచే ఉంచేందుకు ఏ బహుళజాతి కూటమితోనైనా చేరడానికి తాము సిద్ధమని యూఏఈ సంకేతాలిచ్చింది.
Also Read:Holidays: శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. వాళ్లకు ఏప్రిల్ 9, 23, 29న సెలవు ప్రకటన..
భారత్-మధ్యప్రాచ్యం-యూరోప్ ఆర్థిక కారిడార్ (IMEC) వంటి భారీ ప్రాజెక్టులలో యూఏఈ కీలక భాగస్వామి. ఇరాన్ దాడుల వెనుక ఈ ఆర్థిక కారిడార్ను దెబ్బతీసే ఉద్దేశ్యం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. యూఏఈ భద్రతను అస్థిరపరచడం ద్వారా తన దేశంలోని ‘చాబహార్’ పోర్ట్ ప్రాధాన్యతను పెంచుకోవాలని ఇరాన్ చూస్తూ ఉండవచ్చు.
యూఏఈ ప్రస్తుతం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఒకవైపు ఇరాన్తో ఉన్న వేల కోట్ల వాణిజ్యం, మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ రక్షణ బంధం. అందుకే ఎన్ని దాడులు ఎదురైనా, యుద్ధం వల్ల కలిగే విధ్వంసం కంటే దౌత్యపరమైన ఒత్తిడి , అంతర్జాతీయ రక్షణ కవచాలనే యూఏఈ నమ్ముకుంటోంది. ప్రస్తుతానికి ‘బూట్స్ ఆన్ గ్రౌండ్’ (సైన్యాన్ని పంపడం) నిరాకరిస్తూనే.. తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడమే యూఏఈ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.