లండన్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 23న దక్షిణ లండన్లోని క్రోయ్డాన్లో అద్దె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇదే ఇంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకు చెందిన 28 ఏళ్ల గంటి అభిషేక్ ప్రాణాలు కోల్పోగా.. తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన 26 ఏళ్ల కామినేని సాయి శ్రీకర్ బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. తాజాగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో క్రోయ్డాన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
శ్రీకర్ మరణించినట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే కుమారుడి మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకురావాలని అధికారులను కుటుంబ సభ్యులు కోరారు. శ్రీకర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి లండన్ వెళ్లే ముందు హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.
