Karimnagar : కరీంనగర్ జిల్లాలో ఒకరి తర్వాత ఒకరు వరుసగా కుటుంబంలోని ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. గత కొన్ని నెలల కింద ఆ ఇంటి కోడలు ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చనిపోవడం తట్టుకోలేక భర్త మనస్థాపంతో మూడు రోజుల కింద తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు కోడలు అర్ధాంతరంగా తనువు ముగించడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి మనో వేదనతో తల్లిడిల్లి చనిపోయింది. ఈ హృదయ విధారక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Read Also:Trimbakeshwar Temple: త్రయంబకేశ్వర్ ఆలయంలోకి ప్రవేశించిన నలుగురు ముస్లిం యువకులు అరెస్ట్
వివరాల్లోకి వెళితే.. తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామానికి చెందిన శ్యాంసుందర్కి హుస్నాబాద్ కు చెందిన శారదతో గతేడాది మే 15న పెళ్లైంది. కానీ పలు కారణాల వల్ల ఎనిమిది నెలల క్రితం భార్య శారద తన పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. శ్యాంసుందర్కి 65 ఏళ్ల తల్లి బొల్లంపల్లి కనకలక్ష్మి, తండ్రి కనకయ్యతో పాటు నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. భార్య చనిపోవడంతో శ్యాంసుందర్ మనస్థాపానికి గురయ్యాడు. పెళ్లి రోజు సమీపిస్తుండటంతో దాని కంటే ఒక రోజు ముందు అంటే మే 14వ తేదీన భార్య ఆత్మహత్య కు పాల్పడిన చోటే అతడూ సూసైడ్ చేసుకున్నాడు.
Read Also:CM KCR: నేడు బీఆర్ఎస్ కీలక భేటీ.. దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్
ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. అతడి మృతి పట్ల తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది. కుమారుడు కళ్లముందే విగత జీవిగా కనిపించడాన్ని తట్టుకోలేకపోయింది. సోమవారం సొంత ఊరికి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం సోమవారం రాత్రి సమయంలో తల్లి కనకలక్ష్మికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అయితే మార్గం మధ్యలోనే ఆమె మరణించింది. కొంత కాలం వ్యవధిలోనే ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడంతో ఊరిలో విషాదం నెలకొంది.