NTV Telugu Site icon

Revanth Reddy: ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట మేము.. డబుల్ బెడ్రూం ఇచ్చిన చోట మీరు..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: జోగు రామన్న నీతిమంతుడైతే కేసీఆర్ ఎందుకు ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మిమ్మల్ని మోసం చేసిన జోగు రామన్నను ఓడించాలని ప్రజలకు ఆయన సూచించారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనకబడిన జిల్లా అని.. తెలంగాణ వచ్చినా ఇక్కడి ప్రజలకు నీళ్లు రాలేదు.. నిధులు రాలేదు.. నియామకాలు జరగలేదన్నారు. కమీషన్ల కక్కుర్తితోనే మేడిగడ్డ కుంగిపోయిందని, అన్నారం పగిలిపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్న దొంగ కేసీఆర్ అంటూ రేవంత్‌ ఆరోపించారు. కాంగ్రెస్ ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఇస్తే.. పదేళ్లయినా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.

Also Read: PM Modi: “సిగ్గులేదు, మీరు ఇంకెంత దిగజారుతారు”.. నితీష్ కుమార్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ..

జోగు రామన్నకు.. జోకుడు రామన్నకు తేడా లేదన్నారు. రాష్ట్రంలో జోగు రామన్నలాంటి పిల్ల రాక్షసులకు గురువు బ్రహ్మరాక్షసుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. ఆ బ్రహ్మరాక్షసుడిని ఓడించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజలకు ఏమీ చేయని బీఆర్‌ఎస్‌కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. దొరల తెలంగాణ కావాలో, ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాలన్నారు.బీజేపీకి ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని రేవంత్ చెప్పారు. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎం అని గతంలో మాట్లాడిన మోడీ… నిన్న మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా…మోదీ తెలంగాణకు వచ్చి తొండను కూడా పట్టలేకపోయారన్నారు.

Also Read: Komatireddy Rajagopal Reddy: నా లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దింపడమే.. అది బీజేపీతో సాధ్యం కాలేదు..

టికెట్ రానివారు వాడో వీడో చెబితే వినొద్దన్న రేవంత్.. టికెట్ రానివారికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎవరూ భావోద్వేగానికి లోను కావద్దు.. క్షణికావేశానికి గురికావద్దన్నారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిందే కాంగ్రెస్ అంటూ రేవంత్ స్పష్టం చేశారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఎవరు వస్తారో రండి.. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే మేం నామినేషన్లు వేయమని సవాల్ విసిరారు. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన చోట మేం ఓట్లు అడుగుతామని… డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన చోట మీరు ఓట్లు అడగండి అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు. ఈ సవాల్‌కు బీఆర్‌ఎస్ సిద్ధమా అంటూ ప్రశ్నించారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తుంది… ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని రేవంత్ అన్నారు.