Rishikonda Beach: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణపై హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. రుషికొండ బీచ్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చి, బ్లూఫ్లాగ్ హోదా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక శాఖ అధికారులను సమర్థంగా దిశానిర్దేశం చేసి, తక్కువ సమయంలోనే ఈ ఘనతను సాధించామని చెప్పారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు విశేష కృషి చేసిన పర్యాటక శాఖ అధికారులు, విశాఖ కలెక్టర్ హరేంద్రీ ప్రసాద్, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ, పోలీస్, అటవీ శాఖల అధికారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
Read Also: Municipal Chairman: అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత
రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ హోదా పునరుద్ధరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం ఎంతో కీలకమైనదని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ ఇద్దరు నేతలకు తన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో మొదటి ఎనిమిది బీచ్లలో రుషికొండ బీచ్ ఒకటిగా నిలిచిందని మంత్రి దుర్గేష్ వివరించారు. ఈ బీచ్కు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన క్లీన్, సేఫ్, ఎకో-ఫ్రెండ్లీ బీచ్ హోదా రావడం విశాఖపట్నం గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు. రుషికొండ బీచ్ అభివృద్ధికి మరింత కృషి చేసి, ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు.