నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు:
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. నేడు ఆయన 125వ జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అని సీఎం ట్వీట్ చేశారు. ‘తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢసంకల్పానికి నిదర్శనం. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తూ.. ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం’ అని పేర్కొన్నారు.
ఆటోవాలలతో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు:
తిరుమల శ్రీవారి మెట్టు వద్ద ఆటోవాలలతో భక్తులకు తిప్పలు తప్పడం లేదు. శ్రీవారి మెట్టు మార్గం శని, ఆది వారాలలో భక్తులతో కిక్కిరిసిన పోతోంది. దీనిని ఆసరాగా చేసుకుని.. టైమ్ స్లాట్ టిక్కెట్లు తీసి ఇస్తామని తిరుపతి నుంచి శ్రీవారి మెట్టుకు భక్తులను ఆటోవాలలతో తరలిస్తున్నారు. ఒక్కో ఆటో డ్రైవర్ 5 లేక 7 మంది భక్తుల బృందం నుంచి ఐదు వేలకు పైగా వసూల్ చేస్తున్నారు. దీంతో శ్రీవారిమెట్టు మార్గం వద్దకు శ్రీవారి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు కార్లు, బస్సులలో కూడా శ్రీవారి భక్తులను కొందరు కేటుగాళ్లు తరలివస్తున్నారు. ఆటోలు మాత్రమే పంపుతున్నారని టీటీడీ సెక్యూరిటీతో భక్తులు వాగ్వాదం పెట్టుకుంటున్నారు. పంపుహౌస్ వద్ద ఉన్న భారీగేడ్లు, సెక్యూరిటీని తోసుకుని భక్తులు వెళ్తున్నారు. ఆటోవాలల దందాతో శని, ఆది వారాలలో శ్రీవారి మెట్టు వద్ద భక్తులు భారీగా ఉంటున్నారు.
నేడు స్టేషన్ ఘన్పూర్లో సీఎం పర్యటన:
నేడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్ లో శివునిపల్లెకు చేరుకోనున్నారు సీఎం. అక్కడ ఏర్పాటు చేసిన ఇందిరామహిళా శక్తి స్టాల్స్ను పరిశీలించనున్నారు. అనంతరం.. రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాగా.. సీఎం టూర్ ఏర్పాట్లను ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్య పర్యవేక్షించారు. హెలిప్యాడ్, పార్కింగ్, భద్రత ఏర్పాట్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్:
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో.. అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో.. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ సదుపాయాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యవసర ల్యాండింగ్ ప్రకటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, క్షేమంగా విమానం ల్యాండ్ అవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఆ విమానంలో ఉన్న 73 మంది ప్రయాణికులు ఉన్నారు.
రన్యా రావు కేసులో ట్విస్ట్:
రన్యా రావు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. సినీ నటి కావడం, ఆమె సవతి తండ్రి కర్ణాటక డీజీపీ కావడంతో కేసు సంచలనంగా మారింది. అయితే, ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రన్యా రావును అరెస్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాత, ఆమె సవతి తండ్రి, డీజీపీ(కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) కె రామచంద్రరావుని ప్రభుత్వం తప్పనిసరి సెలవులో పంపింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల్లో ఎలాంటి కారణాన్ని పేర్కొనలేదు.
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి హతం:
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్లో హతమయ్యాడు. శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు పాల్పడ్డాడు. NIA అతన్ని వాంటెడ్గా ప్రకటించింది. అబూ ఖతల్.. హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా గుర్తించబడ్డాడు. జమ్మూ కాశ్మీర్లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడికి అబూ ఖతల్ ప్రధాన సూత్రధారి. 2023 సంవత్సరంలో రాజౌరి దాడికి కూడా అబూ ఖతల్ బాధ్యత వహించాడు. సింఘి జమ్మూ కాశ్మీర్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారి. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో భారత వ్యతిరేక సంఘటనలకు పాల్పడిన చాలా మంది వ్యక్తులు మరణించారు. కొన్ని రోజుల క్రితం లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ ఖాసిం హతమయ్యాడు. బషీర్ అహ్మద్ కూడా అనుమానాస్పదంగా మరణించాడు.
దేశంలో డ్రైవర్ రహిత మినీ బస్సు పరుగులు:
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పుడు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఏకంగా డ్రైవర్ రహిత బస్సులు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండానే రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఇది మనదేశంలో కాదండోయ్.. స్పెయిన్ లో అందుబాటులోకి వచ్చాయి. స్పెయిన్లోని బార్సిలోనా డౌన్టౌన్లో డ్రైవర్లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. బస్సు ప్రయాణికులతో స్టాప్ నుంచి బయలుదేరి, లేన్ మారే ముందు బ్రేక్ వేసి నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపించింది. ఈ పరీక్షను రెనాల్ట్ నిర్వహించింది. ఈ బస్సు నాలుగు స్టాపులతో 2.2 కి.మీ దూరం ప్రయాణించింది. ఈ ప్రోటోటైప్ మినీబస్సు కోసం ఫ్రెంచ్ కార్ల తయారీదారు WeRide కంపెనీతో జతకట్టింది.గత సంవత్సరం ఫ్రెంచ్ ఓపెన్ వేదిక వద్ద డ్రైవర్లెస్ బస్సును ఆవిష్కరించారు. ఇప్పుడు బార్సిలోనాలోని ఒక ప్రధాన రహదారిపై దీనిని పరీక్షించారు.
‘ఘాటీ’ విడుదల డౌటే?:
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి కాస్త గ్యాప్ ఇచ్చి మరోసారి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది స్వీటి. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో లేటెస్ట్గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమాను ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. కానీ ఇప్పడు ఆ టైమ్ కు ఘాటీ రాదని టాలీవుడ్ లో వినిపిస్తోంది. షూట్ డిలే కారణంగా కీలకమైన సీన్స్ వర్క్ ఇంకా పెండింగ్ ఉందని వాయిదా పడక తప్పదని సమాచారం. అదే టైమ్ లో మరో రెండు సినిమాలు ఆ డేట్ ను లాక్ చేసుకునే పనిలో ఉన్నాయి.
సినీ కెరీర్లో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న మోహన్ బాబు:
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మొదట విలన్స్గా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి, ఆ తర్వాత స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక్కరు. విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. అలా నటన పరంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మోహన్ బాబు తోటి హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గత కొంత కాలంగా మోహన్ బాబు కొంతవరకు సినిమాలు తగ్గించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అప్పుడప్పుడు మెరుస్తూ, ప్రస్తుతం తన కొడుకుల సినిమా ‘కన్నప్ప’లో మాత్రమే నటిస్తున్నారు మోహన్ బాబు. చెప్పాలంటే ఆయన ఎలాంటి పాత్రనైనా సరే చేసి అలవోకగా మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కనుక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగితే ఆయనకు మంచి అవకాశాలు లైన్ కడతాయి. ఇక దాదాపు 45 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న మంచు మోహన్ బాబు, తాజాగా తన నటన జీవితంలో యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు పిలుపందించాడు. నేటి సాయంత్రం రంగంపేటలో ఏడు గంటలకు విందు ఏర్పాటు చేశారు మోహన్ బాబు.
నేడే ఇండియా – వెస్టిండీస్ ఫైనల్:
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 16) ఆదివారం జరగనుంది. ఈ ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో ఇండియా మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ గట్టి పోటీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ ఆధ్వర్యంలో ఇండియా మాస్టర్స్, బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ మాస్టర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా ఉండనుంది. ఎందుకంటే, రెండు టీమ్స్ మాస్టర్స్ క్రికెట్లో అత్యంత అనుభవం కలిగిన ఆటగాళ్లతో కూడుకున్నాయి. ఇండియా మాస్టర్స్ టోర్నమెంట్లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శన చూపించింది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా మాస్టర్స్ చేతిలో ఒక్క ఓటమి మాత్రమే ఎదురైంది. అయితే, ఆ తర్వాత షేన్ వాట్సన్ జట్టుపై సెమీ-ఫైనల్లో భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది.
ప్రెగ్నెన్సీలో నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారా:
ఈ మధ్యకాలంలో చాలా మంది గర్భిణులు నిద్రలేమి తనంతో బాధ పడుతున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలో చూద్దాం. 1. సరైన నిద్ర లేకపోతే సాధారణ వ్యక్తులే చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది కడుపులో బిడ్డను మోస్తున్న తల్లి నిద్ర సరిగా లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రెగ్నెన్సీ మొదట్లో చాలా మత్తు నిద్ర వస్తుంది. కానీ చివరి నెలలకు చేరుకున్న తర్వాత నిద్ర అనేది లేకుండా పోతుంది. పూర్తిగా మాయమై పోయినట్లు అనిపిస్తుంది. చాలా మంది గర్భవతులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అయితే గర్భిణీ ఈ సమస్య నుంచి బయట పడాలంటే, కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీ చివరి నెలలు వచ్చే సరికి శరీరం పూర్తిగా మారుతుంది. అలసట, ఒళ్లు నొప్పులు వంటివి మరింత ఇబ్బంది పెడతాయి. వీటి కారణంగా ఎంత ప్రయత్నించినా రాత్రిపూట నిద్ర పట్టదు. ఇలాంటప్పుడు మసాజ్ మీకు చాలా సహాయపడుతుంది. మసాజ్ ద్వారా ఒత్తిడి లేదా అలసటతో ఉన్న కండరాలకు చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇది చక్కటి నిద్ర ను అందిస్తుంది. కాబట్టి రాత్రి పడుకోవడానికి ముందు మీ కాళ్ళు, చేతులు లేదా మెడకు చక్కగా మసాజ్ చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు చక్కగా నిద్ర పడుతుంది. అలాగే నైట్ వాక్ కూడా మంచిది ఓపిక ఉన్నంత వరకు వాక్ చేయడానికి ప్రయత్నించడం మంచిది.