లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు అరెస్టు:
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఈరోజు ఉదయం గోవిందప్పను అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకొస్తున్నారు. భారతీ సిమెంట్స్లో గోవిందప్ప డైరెక్టర్గా ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో అయన ఏ33గా ఉన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉంది. ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ బాలాజీ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే వీరు ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ.. విచారణకు డుమ్మా కొట్టారు. గోవిందప్ప మైసూరులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి ఈరోజు అరెస్ట్ చేశారు. గోవిందప్ప అరెస్టుతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది.
సురేష్ బాబుపై అనర్హత వేటు?:
కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించాడని కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో నీపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదో సమాధానం చెప్పాలంటూ మార్చి 28న కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయితే మేయర్ ఆ నోటీస్ పై హైకోర్టును ఆశ్రయించారు. రెండుసార్లు గడువు పెంచిన కోర్ట్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు నేడు మేయర్ సురేష్ బాబు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎదుట సాయంత్రం మూడు గంటలకు హాజరుకానున్నారు. సురేష్ బాబు సంజాయిషీపై ప్రభుత్వం సంతృప్తి చెందకపోతే.. ఆయనపై అనర్హత వేసే అవకాశం ఉంది.
నీరు, ఆహారం విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించవద్దు:
మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశం నేడు (మే 13)న జరిగింది. అడవుల్లో అగ్ని ప్రమాదాలు, వాటి నివారణ, వన్యప్రాణి సంరక్షణ చర్యలపై రాష్ట్ర అటవీ, పర్యారణ, దేవాదాయ శాఖ మంత్రి సంబంధిత ఉన్నతాధికారుల సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలోని వివధ జోన్ల సీసీఎఫ్ లు, అన్ని జిల్లాల డీఎఫ్ఓలతో స్టేట్ పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) డాక్టర్ సువర్ణతో కలసి మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తెలంగాణ రాష్టవ్యాప్తంగా ఉన్న అడవుల్లో అగ్ని ప్రమాదం నివారణకు ఏం పరికరాలు వాడుతున్నారని అధికారులను ఆరా తీశారు మంత్రి సురేఖ. ఇంకా ఎక్కడైన ఒకేసారి పెద్ద అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని నివారించేందుకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్:
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పదవిలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కె. రామకృష్ణారావు కొనసాగుతుండగా.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రిటైర్మెంట్ అయ్యారు. ఆమె స్థానంలో కె. రామకృష్ణారావు సీఎస్గా నియమితులవడంతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానం ఖాళీ అయ్యింది. దీనితో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ పదవిలోకి సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
అధంపుర్ ఎయిర్బేస్కు వెళ్లిన ప్రధాని మోడీ:
నిన్న ఆపరేషన్ సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత, ప్రధాని మోడీ ఈరోజు తెల్లవారుజామున పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం 7 గంటలకు ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి బయలుదేరి పంజాబ్లోని జలంధర్లోని ఆదంపూర్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న వాయుసేన సిబ్బందితో ప్రధాని సమావేశం అయ్యారు. ప్రధాని మోదీ వైమానిక దళ సిబ్బందిని కలిసి వారి మనోధైర్యాన్ని పెంచడానికి కృషి చేశారు. పాకిస్తాన్కు ఇండియా ఎయిర్ఫోర్స్ సత్తా చూపారని ప్రశంసించారు. పాకిస్తాన్ భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తూనే.. తమ దాడిలో ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని పేల్చివేశామని చెప్పిన విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్:
ఆపరేషన్ సిందూర్ కింద సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై చర్య తీసుకున్న తర్వాత, భద్రతా దళాలు ఇప్పుడు సరిహద్దు లోపల అంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సైనిక చర్యను ముమ్మరం చేశాయి. షోపియన్తో సహా వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని షోపియన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు అడవిలో లష్కరే తోయిబా ఉగ్రవాదులను చుట్టుముట్టాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు.
నేటితో పదవీ విరమణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా:
భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13, (మంగళవారం)న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన స్థానంలో సీనియర్ న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ (BR) గవాయి నియమితులవుతారు. రేపు భారత 52వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ బి.ఆర్ గవాయి. రేపు ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం:
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొని వంతెనపై నుంచి కింద పడిపోయిన ప్రమాదంలో మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. తీవ్రగాయాల కారణంగా అక్కడికక్కడే మరణించారని తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడ్డాడని, అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
బరిలోకి గబ్బర్, రైనా:
ఫెవరెట్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా త్వరలో బ్యాట్ పట్టి మైదానంలోకి అడుగుపెట్టబోతున్నారు. గ్రేటర్ నోయిడాలో మే 27 నుండి జూన్ 5 వరకు జరగనున్న ఇంటర్ కాంటినెంటల్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ లో రైనా, ధావన్, శ్రీలంక మాజీ ఓపెనర్ దిల్షాన్ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్లో దిల్షాన్, న్యూజిలాండ్ మాజీ బ్యాట్స్మన్ మార్టిన్ గుప్టిల్ , ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ ఆటగాళ్ళు పాల్గొంటారు. భారత మాజీ బౌలర్లు ప్రవీణ్ కుమార్, మన్ప్రీత్ గోని ఇండియన్ వారియర్స్ తరపున ఆడనున్నారు. ఆరు జట్లు పాల్గొనే ఈ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఆరు ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టోర్నమెంట్లో ఆరు జట్లు పాల్గొంటాయి. అంతర్జాతీయ స్థాయిలో విశేషంగా ఆకట్టుకున్న ఈ సీనియర్ ఆటగాళ్లు మరోసారి బ్యాట్ పడుతుండటంతో ఫ్యాన్స్ కూడా లెజెండ్స్ ఛాంపియన్షిప్ పై ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే:
కొత్త షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ 2025లో జరగాల్సిన 17 మ్యాచ్లు దేశంలోని 6 ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే మే 17న బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్తో టోర్నీ మళ్లీ ప్రారంభమవుతుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం లీగ్ దశ మే 27న ముగియనుండగా.. మే 29న క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్-2 మ్యాచ్లు గరుగుతాయి. ఇక చివరగా ఫైనల్ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. గత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్ రెండు కీలక మ్యాచ్లను బీసీసీఐ తాజా షెడ్యూల్లో తొలగించింది. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ నగరం ప్రస్తుతం “రెడ్ జోన్” కింద ఉండటంతో భద్రతాపరంగా పూర్తి హామీ ఇవ్వలేమని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అభిప్రాయపడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లో జరగాల్సిన ఒక లీగ్ మ్యాచ్ను కూడా ఢిల్లీకి తరలించింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక మిగతా మ్యాచ్లు బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీ, ముంబై వేదికలపై కొనసాగనున్నాయి. ప్లేఆఫ్స్ మ్యాచ్ల ఖచ్చితమైన వేదికల వివరాలను కూడా త్వరలో ప్రకటించనున్నట్లు బోర్డు తెలిపింది.
కోలీవుడ్ నటుడు సంతానంపై కేసు నమోదు:
డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ (డీడీ) సినిమాపై కోలీవుడ్లో కొత్త వివాదం రేగింది. డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారు. అది తిరుమల శ్రీవారిని అవమానించడమేనని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ పాటను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి హిందూ సంఘాలు. అయితే వివాదంపై స్పందించిన నటుడు,హీరో సంతానం మాట్లాడుతూ ‘ తిరుమల శ్రీవారిని అవమానించలేదు. సినిమా ఇప్పటికే సెన్సార్ పూర్తయ్యింది. సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. రోడ్డుమీదా పోయో ప్రతి ఒక్కరు ఎదో ఒకటి మాట్లాడుతారు, వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నిబంధనల ప్రకారమే సినిమా తీశాం. ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు. మరోవైపు సినిమాలో పాటపై తమిళనాడులోని పలు పోలీస్స్టేషన్లలో డీడీ నెక్ట్స్ లెవెల్ చిత్ర హీరో, మేకర్స్ పై ఫిర్యాదులు చేసారు హిందూ సంఘాలు. కాగా ఈ సినిమా ఈ నెల 16న వరల్డ్ వైడ్ గా రీలీజ్ కానుంది.
ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది:
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్దం సద్దుమణిగిన నేపథ్యంలో ఒక్కోక్కరిగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మన భారత్ సైనికుల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ, ప్రాణాలు అర్పించిన వారి పై భావోద్వేగానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు.‘గత కొన్ని రాత్రులు తలుచుకుంటే తెలియని భయం. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది. మనం ఇళ్లలో నిద్రపోతున్నాము అంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. అలాగే ఈ ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుసు. ఇటీవలే జరిగిన మధర్స్ డే రోజు.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను కని పెంచిన తల్లుల గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను.
రికార్డ్ ధర పలికిన తగ్ లైఫ్:
కమల్ హాసన్- మణిరత్నం కాంబోలో వస్తోన్న గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్పై భారీ హైప్,హోప్ ఉన్నాయి కోలీవుడ్ సినీ సర్కిల్లో. ఎన్నో ఏళ్ల తర్వాత లెజండరీ యాక్టర్ అండ్ డైరెక్టర్ కొలబ్రేట్ కావడంతో పాటు రిలీజ్ చేసిన టీజర్ ఎక్స్ పర్టేషన్స్ ఎవరెస్ట్ తాకుతున్నాయి. జూన్ 5న రాబోతున్న ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇప్పటికే సినిమా లెవల్లో సోల్డ్ అయ్యాయి. సుమారు రూ. 150 కోట్ల భారీ ఎమౌంట్ పెట్టి హక్కులు తీసేసుకుంది నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు కమల్ సినిమానే హయ్యెస్ట్ రేటుకు అమ్ముడై రికార్డ్స్ సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు మేకర్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ధరకు ఈ రైట్స్ అమ్ముడయ్యాయి. కోలీవుడ్ ప్రముఖ ఛానెల్ విజయ్ టీవీ తగ్ లైఫ్ రూ. 60 కోట్లకు కొనుగోలు చేసింది. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండా ఈ ధర అంటే రికార్డ్ ధర అనే చెప్పాలి. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, మరొక యంగ్ హీరో అశోక్ సెల్వన్, స్టార్ హీరో హీరోయిన్ త్రిష, అభిరామి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 5న పాన్ ఇండియా బాషలలో విడుదల కానుంది. దాదాపు 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో సినిమా వస్తుండంతో ఈ సినిమాకు అటు డిజిటల్, ఇటు శాటిలైట్ భారీ ధర వెచ్చించాయి.