ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. జగన్కు ఓటు వేస్తే పథకాలు అన్ని వస్తాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వదలి బొమ్మాలీ అంటూ పసుపు పతి మళ్ళీ లేస్తాడు.. మీ రక్తం తాగుతాడని విమర్శించారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా కలికిరి ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. చంద్రబాబు రైతులకు ఎప్పుడైన రైతు భరోసా ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. జగన్ స్కీం అయినా రైతు భరోసాను చంద్రబాబు రెట్టింపు ఇస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. చంద్రబాబు ఎప్పుడైన రైతులకు ఒక్కరూపాయి అయినా ఇచ్చాడా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింట ప్రచారం చేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది
జహీరాబాద్లో నేడు బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమస్కారం. కేతకి సంగమేశ్వర, ఏడుపాయల దుర్గా అమ్మవారు, బసవేశ్వరునికి నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. పదేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూశారని, కాంగ్రెస్ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్ చేతిలో దేశం అవినీతిమయం అయిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్ఎస్ లూటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ లూటీ చేస్తుందని, కాళేశ్వరం ఫైల్స్ ఈ ప్రభుత్వం తోక్కిపెట్టుందన్నారు. తోడు దొంగలు ఒకరికొకరు కాపాడుకోవాలని చూసుకుంటున్నారని, రెండు పార్టీ కు వేర్వేరు కాదన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కాం పార్టీతో కాంగ్రెస్ అలయన్స్ ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది.. కాంగ్రెస్ అన్నదాత లను మోసం చేస్తుందని, రైతు రుణ మాఫీ చేయలేదు .. 500 బోనస్ ఇవ్వడం లేదు… నోరు మెదపడం లేదన్నారు మోడీ.
దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ఏలూరు జిల్లా దెందులూరు ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి వంగవీటి రాధా అని.. ఆయన సేవలు ఈ రాష్ట్రానికి అవసరమని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. దెందులూరులో చింతమనేని అభిమానులు ఎక్కువ ఈలలు వేస్తారు తక్కువ పని చేస్తారు.. ఇకనుంచి ఎక్కువ పని చేయాలన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకుడు అంటే సింహాలు, పులులు అని చెప్పడం కాదు సమర్థవంతమైన పాలు అందించేవాడు నాయకుడన్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసేవాడు నాయకుడు.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని వాడు నాయకుడు కాదన్నారు. కార్యకర్తలు తప్పుడు కేసులకు భయపడొద్దని.. పెట్టిన కేసులకు వడ్డీతో సహా తీర్చే బాధ్యత నాది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేత
మధ్యప్రదేశ్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంనివాస్ రావత్ మంగళవారం బీజేపీలో చేరడంతో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంనివాస్ రావత్ దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. గతంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సమక్షంలో రాంనివాస్ రావత్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యంగా, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలోనే రావత్ పార్టీ మారడం గమనార్హం.
రామ్నివాస్ రావత్ షియోపూర్ జిల్లాలోని విజయ్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయపూర్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావత్ 2019 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర సింగ్ తోమర్పై మొరెనా స్థానం నుంచి పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. రామ్నివాస్ రావత్ ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. ఇండోర్ లోక్సభ నియోజకవర్గం అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీలోకి మారిన ఒక రోజు తర్వాత మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి తాజా దెబ్బ తగిలింది.
ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలేవి..? కాంగ్రెస్పై అమిత్ షా ప్రశ్నలు
మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.
కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షా ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్లు గత కొద్ది రోజులుగా హాసన్లో మారుమోగుతున్నాయి. కాగా.. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన హాసన్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్యర్థి రేవణ్ణ (33) పోటీ చేశారు.
కేసులకు రేవంత్ రెడ్డి భయపడుతాడా
భూపాలపల్లి జిల్లా రేగొండ జన జాతరలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామాన్ని కెసిఅర్ ప్రభుత్వం చేయలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రెవెన్యూ గ్రామము చేసి మన చిత్త శుద్దిని చాటుకున్నామన్నారు. సెమీ ఫైనల్ లో ఆరోజు కేసీఆర్ను ఓడించి బుద్ధి చెప్పామని, ఈ ఫైనల్ లో గుజరాత్ నుండి వచ్చిన మోడీ నీ ఒడగొట్టాలన్నారు. ఈ గడ్డ పైనా గుజరాత్ పెత్తనం ఏంటి అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కు చేయాల్సిన అన్యాయం చేశారని, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడా అని ఆయన అన్నారు. బీజేపీకి నాలుగు వందల సీట్లు కావాలి.. ఇవి ఎందు కంటే రిజర్వేషన్లు ను ఎత్తే సేందుకే ఈ సీట్లు అడుగుతున్నారు బీజేపీ నేతలు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏస్ సి ..ఏస్టి కి రిజర్వేషన్లు ఇచ్చి వారి అభివృద్ధి కి సహకరించింది.. ఓబీసి కూడా రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, బీసీ రిజర్వేషన్ లు పెంచాలని మేము అంటుంటే అగ్ర వర్ణాల కోసం ఈ రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. బడుగు బలహీనర్గాలకు రిజర్వేషన్లు కోసం నేను అడుగుతుంటే. డిల్లి నుండి బిజెపి వాళ్ళు నాకు నోటీసులు ఇచ్చారని, కేసులకు రేవంత్ రెడ్డి భయపడుతారా అని ఆయన వ్యాఖ్యానించారు.
జనంలోకి సీఎం జగన్.. రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్. నిన్న మూడో రోజున మూడు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాల్లో పర్యటించారు సీఎం జగన్. మలి విడత ప్రచారంలో డోస్ పెంచేసారు సీఎం జగన్. కూటమిపై ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. 2014 మేనిఫెస్టోలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్రజలకు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోను చూపిస్తూ.. అందులో ఎన్ని హామీలు అమలు కాలేదో.. ఎందుకు కాలేదో వివరిస్తున్నారు. తాజాగా టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కూటమి మేనిఫెస్టోపై పేర్ని నాని సెటైర్లు
ఏపీలో ఎన్డీయే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి పేర్ని నాని సైటైర్లు వేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చే హామీలు అమలు సాధ్యం కాదని బీజేపీ అర్థమైపోయిందని ఆయన అన్నారు. అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. తమకు సంబంధం లేదని బీజేపీ తప్పుకుందన్నారు. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారని విమర్శించారు. కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసిందని.. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారని పేర్ని నాని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదన్నారు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదన్నారు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. 2019లో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారని.. ఇప్పుడెందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. కళకళలాడుతుండే డ్వాక్రా గ్రూపులు చంద్రబాబు మూలంగా నాశనమయ్యాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు మళ్లీ దొంగ హామీలతో చంద్రబాబు జనం ముందుకొస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని పేర్ని నాని తెలిపారు.
ఢిల్లీలో మోడీకి, ఇక్కడ ఉన్న రేవంత్కి మాటలెక్కువ, చేతలుతక్కువ
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జగదేవ్ పూర్లో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దు అని రేవంత్ రెడ్డి అన్నారని, చెవేళ్ళలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి లో సునీతా, వరంగల్ లో కడియం కావ్య, సికింద్రాబాద్ లో దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. కాకులు వాలనీయను అని చెప్పి గద్దలను ఎత్తుకు వెళ్లినవ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. ఢిల్లీలో మోడీకి, ఇక్కడ ఉన్న రేవంత్ కి మాటలెక్కువ, చేతలుతక్కువ అని ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ పార్టీకి గడ్డ పారలు అవుతాయని, కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టే అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జమ్మికుంటలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి మా ఇంటిపై వాలొద్దని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.