ఏపీలో చల్లబడ్డ వాతావరణం.. పలు ప్రాంతాల్లో వర్షం
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది. కొద్ది రోజులుగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతో వడగాల్పులకు ఇబ్బంది పడిన ప్రజలు సేద దీరారు. భారీ వర్షానికి కార్లు, బైక్లు నీటిలో కొట్టుకుపోయాయి. పది మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. కంభాల చెరువు వద్ద వర్షపు నీటిలో చిక్కుకుంది. అంతేకాకుండా.. నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెట్లు నేలకు ఒరగడంతో విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపడ్డాయి.
లష్కర్ కమాండర్తో సహా ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చిన భద్రతా బలగాలు..
జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. నిషేధిత లష్కరే తోయిబా అనుబంధంగా ఉన్న ది రెసిస్టెంట్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) ఉగ్రసంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. జమ్మూ కాశ్మీర్ కుల్గామ్లో మంగళవారం భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో కమాండర్ స్థాయి ఉగ్రవాది బాసిత్ దార్ హతమయ్యాడు. ఇతను సెక్యూరిటీ ఏజెన్సీల ‘‘మోస్ట్ వాంటెడ్ లిస్టు’’లో ఉన్నారు. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు కూడా ఉంది. పోలీస్ సిబ్బందితో పాటు సాధారణ పౌరులను చంపిన 18 కంటే ఎక్కువ కేసుల్లో ఇతడి ప్రమేయం ఉన్నట్లు కాశ్మీర్ ఐజీ తెలిపారు.
బెంగాల్ టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. సీబీఐ దర్యాప్తు కొనసాగించడానికి మాత్రం సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే ఏ అధికారి లేదా అభ్యర్థిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం సూచించింది.
పశ్చిమ బెంగాల్లో 25,000 మందికి పైగా అసిస్టెంట్ టీచర్లు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని.. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎటువంటి బలవంతపు చర్యలు ఉండవని కోర్టు పేర్కొంది.
ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..
తెలంగాణలో రైతు భరోసా నిధులను ఈసీ నిలిపివేసింది. సోమవారం నిధుల డిపాజిట్కు అధికారం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. మే 13న లోక్సభ ఎన్నికల తర్వాతే రైతుల భరోసా, పంటనష్టం చెల్లింపులకు సంబంధించిన సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసాకు నిధులు ఇచ్చి ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని ఈసీ పేర్కొంది. ఈ మేరకు నిధుల జమ ఆలస్యం కానున్నట్లు ఈసీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
వచ్చే ఎన్నికలలో ప్రజలు గెలవాలి.. ధర్మం గెలవాలి
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ భారీ బహిరంగ నిర్వహించింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఐదేళ్ళుగా పేదలపై భారం మోపుతూ.. బాదుడే బాదుడు అని ఆరోపించారు. ఏడుసార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు.. రెండు వందలు వస్తున్న కరెంట్ బిల్లు వెయ్యి దాటి రెండువేల వరకు వెళ్ళిందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు, పెట్రోలు ధరకు ఆఖరికి చెత్త పన్ను వేశాడని సీఎం జగన్ పై దుయ్యబట్టారు. ప్రతి ఎన్నికలకు ఏదో ఒక డ్రామా ఆడుతున్నాడని మండిపడ్డారు. ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్ పై పోరాటం చేస్తామన్నారు. మరోవైపు.. దేశంలో ఉన్న ప్రతి ఒక్క నేత టీడీపీకి సపోర్టు చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు.
మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనే..
విశాఖలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓల్డ్ గాజువాకలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులు ప్రకటించే ధైర్యం చేసింది జగనేనని తెలిపారు. విశాఖను రాజధానిగా చేయడమే కాదు.. జూన్ 4న ప్రమాణ స్వీకారం, పాలన చేసేది ఇక్కడ నుంచేనని పేర్కొన్నారు.
నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు
సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని చెప్పుకొచ్చారు. ఓ జాతీయ మీడియాతో మోడీ మాట్లాడారు. ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినప్పుడు ముస్లిం మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. వారి ఆందోళనలను తాను అర్థం చేసుకున్నానని.. ముస్లిం సోదరీమణులంతా భావించారని ప్రధాని వెల్లడించారు.
భారీ వర్షానికి తడిసిముద్దైన హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం, వడగళ్ల వానలు కురిశాయి. హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు ఆకస్మిక మరియు తీవ్రమైన వాతావరణ మార్పులతో మునిగిపోయాయి, వాతావరణ పరిస్థితుల్లో నాటకీయ మార్పులకు కారణమైంది. అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షపాతం మరియు ఉరుములతో కూడిన గాలివానలతో కూడిన ఉష్ణోగ్రతలో గణనీయమైన తగ్గుదల ఉందని నివేదికలు సూచిస్తున్నాయి . హైదరాబాద్లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, మూసాపేట్లో భారీ వర్షం కురుస్తుండగా, బాలానగర్, ఫతేనగర్, సనత్నగర్లో కూడా వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, చింతల్, షాపూర్, కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
పవన్ కళ్యాణ్ కాలికి గాయం?
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కాలికి గాయమైనట్లుగా తెలుస్తోంది. ఈ రోజు తిరుపతిలో వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర కోసం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక రేణిగుంట విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన కుడి కాలి బొటనవేలుకి కట్టు కనిపిస్తోంది. అయితే అసలు కాలికి ఏమైంది? అనే విషయం మీద పూర్తిస్థాయిలో అవగాహన లేదు. దానికి తోడు ఆయన వేగంగా నడవకుండా చాలా నెమ్మదిగా నడుస్తూ కాన్వాయ్ ఎక్కడాన్ని అభిమానులు గమనించారు. అయితే అసలు పవన్ కాలికి ఏమైంది అనే విషయం మీద పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద జనసేన పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్రకటనలు లేవు. పవన్ కాలికి ఏం జరిగింది? అనే విషయం మీద జన సైనికులు, పవన్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటి..?
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల నోట్లో మట్టికొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా స్వార్ధరాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజనాలో రూపాయి లేకుండా ఆగంచేసిపోతే.. తాము రైతుల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి.. రైతుభరోసా (రైతుబంధు) వేస్తే.. బీజేపీ కుటిల రాజకీయాలు చేసి అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రైతు భరోసా ను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమయానికి రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమయం కంటే ముందుగా నిన్ననే ఒకేసారి రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా ఆదేశాలు ఇచ్చారు. రైతులంతా తమ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయని సంతోషపడే లోపలే.. ఎన్నికల కమిషన్ (ఈసీ) ని అస్త్రంగా చేసుకొని బీజేపీ రైతుల ఖాతాలో పడ్డ నిధులను ఆపేలా కుట్రలు చేయడం బాధాకరం. బీజేపీకి మొదటి నుంచీ అన్నదాతలు అంటే అక్కసు, ఆగ్రహం.. అందుకే నల్ల చట్టాలు తెచ్చి రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేసింది.. ఈ నల్ల చటాలకు వ్యతిరేకంగా పోరాడిన వందలాది రైతులను పొట్టన పెట్టుకుంది.