ఎన్డీయే వర్సెస్ ఇండియా.. ఉత్తరప్రదేశ్లో ఆ కూటమికి తొలిపోరు
ఉత్తర ప్రదేశ్లోని ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక ద్వారా ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య తొలి ఎన్నికల పోరు ప్రారంభమవుతోంది. ప్రతిపక్ష ఇండియా కూటమి భవిష్యత్ ఎన్నికలలో సాధ్యమైనంత వరకు కలిసి పోటీ చేస్తామని చెప్పిన కొన్ని రోజుల తర్వాత.. 28 మంది సభ్యుల కూటమి మొదటి పరీక్షను ఎదుర్కొంటోంది. బీఎస్పీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను నిలబెట్టకుండా ఎస్పీకి మద్దతివ్వడంతో ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య ఇది తొలి ఎన్నికగా చెప్పవచ్చు. రాష్ట్రీయ లోక్ దళ్, అప్నా దళ్ (కామెరావాడి), వామపక్షాలు సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థికి మద్దతుగా నిలిచాయి. ఘోసీ అసెంబ్లీ ఉప ఎన్నిక రేపు (సెప్టెంబర్ 5) జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఘోసీ ప్రజలు తమ పార్టీ అభ్యర్థికి ‘రికార్డ్ విజయం’ అందజేయాలని తమ మనస్సులో నిర్ణయించుకున్నారని ప్రకటించారు. “ఘోసీ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏమీ మిగలలేదు, ఎందుకంటే ప్రజలు మా అభ్యర్థిని నిర్ణయించారు. ప్రజలను జాగ్రత్తగా చూసుకునే సుధాకర్ సింగ్ రికార్డు మెజారిటీతో విజయం సాధిస్తారు” అని అఖిలేష్ యాదవ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ఘోసీ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచేందుకు వివాదాస్పద ప్రసంగాలు చేశారని ఆయన ఆరోపించారు. అక్కడ ఏ మంత్రులు ప్రచారం చేసినా ఫలితం మారదన్నారు. కేంద్రంలో పదేళ్లు, రాష్ట్రంలోని ఆరేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
సంక్రాంతికి గంగిరెద్దుల్లాగా ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తున్నారు.. ఆగం కావొద్దు
రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రస్తుత సర్వే ప్రకారం 94 సీట్లు వస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల హాయంలోనే సింగరేణి బొగ్గు బ్లాక్ ను వేలం వేశారన్నారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 49 శాతం సింగరేణి వాటాను కేంద్రానికి అమ్మింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు, నాయకులు ఎన్ని దీక్షలు చేసిన కాంగ్రెస్ ఎంపీలకు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు అయిందని, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అని ఆయన విమర్శలు గుప్పించారు. నాలుగున్నర ఏళ్ల తర్వాత సంక్రాంతికి గంగిరెద్దుల్లాగా ప్రతిపక్షాలు ఓట్ల కోసం వస్తున్నారని, దయచేసి ప్రజలు ఆగం కావొద్దన్నారు బాల్క సుమన్.
భర్త రాసలీలలు.. అరగుండు గీసి ఊరేగించిన భార్య..
ప్రస్తుతం అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్య, భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో మరో వ్యక్తితో రిలేషన్ షిప్ కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి విషయాలు తమ ఇళ్లలో తెలిసి.. కొంత మంది తమ భార్య, భర్తలను చంపేస్తుంటే.. మరి కొంత మంది వారిని వదిలి ఉండలేక తమ ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కానీ, కొన్ని చోట్ల భార్యభర్తల అక్రమ సంబంధాలపై గుండు గీసి నగ్నంగా ఊరేగింపు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సేమ్ అలాంటి సీన్ ఇప్పుడు శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్యసాయి హిందూపురం జిల్లాలో నేడు ( సోమవారం ) దారుణం చోటు చేసుకుంది. లేపాక్షి మండలంలోని ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయంపై భర్తను పలుమార్లు భార్య నిలదీసింది. అయినా కూడ అతనిలో మార్పు రాలేదు. ఇవాళ లేపాక్షి మండలంలోని తిలక్ నగర్ లో మరో మహిళతో హుస్సేన్ ఉండగా.. అతడ్ని భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తకు, అతని ప్రియురాలికి భార్య అరగుండు కొట్టించి.. ఇద్దరికి చేతులు కట్టేసి.. గ్రామంలో ఊరేగించింది.
ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..
కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం, ఆ సమావేశాల్లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు పెడతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు సమావేశాలకు పిలుపునిచ్చిన తర్వాతి రోజే కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికలకు వెళ్లవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఉద్దేశం ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టడమే అని.. దాన్ని ఎలా సమర్థిస్తామని ఆయన ప్రశ్నించారు. నిజంగా దీని ఉద్దేశం ఎన్నికల్ని సరళీకృతం చేయడమైతే ఏం సమస్య లేదని అన్నారు. ఇప్పుడు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అన్నారు, తర్వాత ‘వన్ నేషన్ నో ఎలక్షన్’ అంటారని వ్యాఖ్యానించారు.
అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలి
నల్లగొండలోని తన నివాసంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం దురాలోచన చేసే వారిని ప్రజలు గమనించాలని, తెలంగాణను వ్యతిరేకించి మళ్ళీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు కేవీపీ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సమైక్య వాదుల కబంద హాస్తాల్లోకి తెలంగాణ పోవద్దని, హైదరాబాద్ లోనే ఉంటాం, తెలంగాణకు ద్రోహం, కుట్రలు చేస్తామంటే సహించరన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. తెలంగాణపై దండయాత్రలా కేవీపీ, షర్మిల, రేణుకా చౌదరి వ్యాఖ్యలు ఉన్నాయని, జమిలి ఎన్నికలు సాధ్యం కాదనేది అందరికీ తెలుసన్నారు.
గవర్నర్ జేమ్స్బాండ్ లాగా వ్యవహరిస్తున్నారు .. బెంగాల్ మంత్రి కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ జేమ్స్ బాండ్లా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రెసిడెన్సీ యూనివర్శిటీ సహా ఏడు యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీసుకున్న చర్య నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు గవర్నర్ను “జేమ్స్ బాండ్”తో పోల్చారు. గతంలో బెంగాల్ గవర్నర్గా పనిచేసిన ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఈ విధంగా వ్యవహరించిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆదివారం ఏడు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించారు. ప్రెసిడెన్సీ యూనివర్సిటీతో పాటు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ బుర్ద్వాన్, నేతాజీ సుభాస్ ఓపెన్ యూనివర్శిటీ, వెస్ట్ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ యానిమల్ అండ్ ఫిషరీ సైన్సెస్ ఉన్నాయి.
మద్యానికి బానిసై ముగ్గురు కూతుళ్ల గొంతు కోసిన తండ్రి
కేరళలోని కొట్టాయం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన తండ్రి మృగంగా మారాడు. మానసిక ఒత్తిడితో మొదట తన ముగ్గురు కూతుళ్లను గొంతు కోసి చంపాలని ప్రయత్నించి, ఆ తర్వాత తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మద్యానికి బానిసయ్యాడని, ఏడాది క్రితమే భార్య వదిలి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురై మానసిక ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు.
కావలిలో వైసీపీ, జనసేనల మధ్య ఫ్లెక్సీల వార్..
నెల్లూరు జిల్లా కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలకు దత్తపుత్రుడు అని కార్టూన్ బొమ్మతో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో ఆ ఫ్లెక్సీని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుజనసేన నేతలు విజ్ఞప్తి చేశారు.. జనసేన నేతల విజ్ఞప్తికి మున్సిపల్ కమిషనర్ స్పందిచకపోవటంతో జనసేన ఆధ్వర్యంలో అక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పాపం పసివాడు.. సీబీఐ దత్తపుత్రుడు.. 420 కాదని నిరూపించగలరా అనే ఫ్లెక్సీని జనసేన నాయకులు ఏర్పాటు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనతో కావలి బ్రిడ్జి సెంటర్ లో భారీగా పోలీసుల మొహారించారు.
బండ్లగూడలో కీచక బాబా అరెస్టు..
మహిళకు వైద్యం చేయిస్తాననే నెపంతో ఆమెపై రెండు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక బాబాను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ పేరుతో నవ వధువుపై అత్యాచారానికి పాల్పడ్డ నకిలీ బాబా మాజర్ ఖాన్.. బండ్లగూడలో యునాని మెడిసిన్ షాపు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన నెల రోజులకే నవవధువు తీవ్ర అస్వస్థత గురైంది. దీంతో.. చికిత్స నిమిత్తం మాజర్ ఖాన్ వద్దకు అత్తమామలు తీసుకువెళ్లారు. అయితే.. చికిత్స పేరుతో మహిళను వివస్త్ర చేసి మజార్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం విషయం కుటుంబ సభ్యులకు చెప్తే చంపేస్తానని బెదిరింపులు గురి చేశాడు. భర్తకు విషయం తెలిసి బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల 19వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. మాజర్ ఖాన్ నకిలీ బాబా అవతారం ఎత్తి ట్రీట్మెంట్ పేరుతో పలువురు మహిళలను యువతులను మోసం చేసినట్లుగా బండ్లగూడ, చాంద్రాయణగుట్, కంచన్బాగ్ సహా పలు ప్రాంతాల నుండి పలు ఫిర్యాదులు అందాయి. దాంతో.. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించిన పోలీసులు నకిలీ బాబాను అరెస్ట్ చేశారు.
పాక్ లో అడుగుపెట్టిన బీసీసీఐ చీఫ్
పాక్ క్రికెట్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల తర్వాత భారత క్రికెట్ బోర్డు నుంచి ఇద్దరు ప్రముఖులు, పాకిస్తాన్లో పర్యటించారు. ఆసియా కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా.. బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షాకి ఆహ్వానం పంపించారు. అయితే భారత హోం శాఖ మంత్రి అమిత్ షా కొడుకైన జై షా, పాక్ లో అడుగుపెడితే అది రెండు దేశాల్లో చాలా పెద్ద చర్చకు దారి తీసే ఛాన్స్ ఉంది. దీంతో జై షా స్థానంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆసియా కప్ ఆరంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారనే టాక్ వచ్చింది. అయితే.. వీసా క్లియరెన్స్ ఆలస్యం కావడంతో నేడు (సోమవారం) బీసీసీఐ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ కు చేరుకున్నారు. ఈ ఇద్దరూ వాగా బార్డర్ ద్వారా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో పాక్ కు వెళ్లారు. రేపు లాహోర్లో ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక మధ్య గ్రూప్ బీ మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 6న పాకిస్తాన్, గ్రూప్ బీ2 టీమ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ కొనసాగనుంది.
రుణమాఫీ డబ్బు ప్రతి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష
రైతు రుణమాఫీపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి హరీష్ రావు అధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో… దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణరావు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్, ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని అని కొనియాడారు. రుణమాఫీ డబ్బు ప్రతి రూపాయి రైతు చేతికి వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే లక్షలోపు ఋణాలు మాఫీ చేసిందన్నారు. మిగతావారికి ప్రాధాన్యతా క్రమంలో రుణమాఫీ జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు.