NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

దక్షిణ తైవాన్‌ను హడలెత్తించిన క్రాథాన్ తుఫాన్.. ఇద్దరు మృతి

దక్షిణ తైవాన్‌ను టైఫూన్ క్రాథాన్ బెంబేలెత్తించింది. అత్యంత శక్తివంతంగా తుఫాన్ దూసుకొచ్చింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. దాదాపు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడంతో వస్తువులు గాల్లోకి ఎగిరిపోయాయి. భారీ ఎత్తున ఆస్తులు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఇద్దరు మరణించారు. ఇక భారీ వర్షం కారణంగా ప్రధాన ఓడరేవు నగరం కాహ్‌సియంగ్‌ను ముంచెత్తింది. దీంతో ద్వీపాన్ని రెండో రోజు కూడా మూసివేశారు. గంటకు 135 కిలోమీటర్ల (గంటకు 85 మైళ్లు) గాలులతో టైఫూన్ క్రాథాన్ గురువారం మధ్యాహ్నం దక్షిణ తైవాన్‌ను తాకింది. ఈ తుఫాన్ కేటగిరీ 1 అట్లాంటిక్ హరికేన్‌తో సమానం.

తైవాన్ సెంట్రల్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ప్రకారం. ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపింది. 219 మంది గాయపడ్డారని, ఒక వ్యక్తి కూడా తప్పిపోయినట్లు తెలిపారు. ఈ విపత్తు గురించి ముందుగానే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక తైవాన్‌ను భారీ వరదలు ముంచెత్తడంతో పాఠశాలలు, స్టాక్ మార్కెట్లను మూసివేశారు. వందల సంఖ్యలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. లక్షకు పైగా గృహాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయడానికి 38,000 మందికి పైగా తైవాన్ సైనికులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

కొండా సురేఖ పై నాగార్జున పరువు నష్టం దావా?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ హీరో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో క్రిమినల్‌ డిఫమేషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు నాగార్జున తరపు న్యాయవాది. మంత్రి కొండా సురేఖ తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారు అని నాగార్జున పిటిషన్‌ లో పేర్కొన్నారు. నిజానికి నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణం అని, హీరోయిన్ ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే (కేటీఆర్) కదా? అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో అడుకుంది కేటీఆర్ అన్న ఆమె మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని తెలిపారు.

సీఎం రేవంత్‌కు మల్కాజిగిరి ఎంపీ ఈటల సవాల్

సీఎం రేవంత్ కు.. మల్కాజిగిరి మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. దమ్ము, ధైర్యం ఉంటే ఇద్దరం సెక్యురిటీ లేకుండా మూసీ పరివాహ ప్రాంతానికి వెళ్దామని, మూసీ పరివాహ ప్రాంత ప్రజలు నిన్ను శభాష్ అంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని, ముక్కు నేలకురాసి క్షమాపణ చెబుతా అని ఈటల రాజేందర్‌ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ప్రజల చేత ఇంతగా తిట్టించుకున్న నాయకుడు ఎవరు లేరు అని, గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారన్నారు ఎంపీ ఈటల. కడుపుమండి మాట్లాడిన పేదలను 5 వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారని, అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్ కు అధికారం నెత్తికెక్కిందని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్ అంటేనే బంధుప్రీతి, కులతత్వం.. ప్రధాని మోడీ ఫైర్..

మరో రెండు రోజుల్లో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ముగియడానికి రెండు గంటలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అవినీతి, కులతత్వం, మతతత్వం, ఆశ్రిత పక్షపాతానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని రోజులుగా తాను హర్యానాలో పర్యటిస్తున్నానని, ప్రజలు మూడోసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలను అంగీకరించబోమని మోడీ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్లు చేశారు.

2014 నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హర్యానా ప్రజల్ని సుసంపన్నం చేయడానికి కృషి చేసిందని, అన్ని వర్గాల సంక్షేమంపై దృష్టి సారించిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపారు. తండ్రీకొడుకుల రాజకీయాల (‘బాపు-బేటే కి రాజనీతి’) ప్రాథమిక లక్ష్యం స్వార్థం మాత్రమే అని ఆరోపించారు. హిమాచల్, కర్ణాటక కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత హర్యానా ప్రజలు ఆ పార్టీని అస్సలు కోరుకోవడం లేదని చెప్పారు.హర్యానాకు కాంగ్రెస్ ఎప్పటికి సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వలేదని, ఆ పార్టీ అంతర్గత పోరును ప్రస్తావించారు.

వెంకన్నకి అపచారం జరిగితే.. మాట్లాడకుండా ఎలా ఉంటాం..

తిరుపతిలో వారహి డిక్లరేషన్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వంద రోజుల్లో ఎప్పుడు రోడ్డు మీదకు రాలేదు‌.. సంక్షేమం, అభివృద్ధి ఇచ్చి హామీలను నిలబెట్టు కోవడానికి కూటమీ ప్రభుత్వం పని చేసింది.. పగ, ప్రతీకార రాజకీయాలుండవని గెలవగానే చెప్పామన్నారు. పది సంవత్సరాలు ఇష్టం వచ్చినట్లు తిట్టారు‌.. అనేక రకాలుగా దూషించారు‌.. అయినా ఎప్పుడు బాధ పడలేదు‌.. కానీ వేంకటేశ్వర స్వామి మీదకే వస్తే ఎందుకు ఊరుకుంటాం.. అన్నీ రాజకీయాలేనా.. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా అని ఆయన మండిపడ్డారు. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని కోరుకున్నా.. వైసీపీ నేతలే ఈ పరిస్థితిని తీసుకొచ్చారు.. నాకు అన్యాయం జరిగిందని నేు బయటకు రాలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

2017లో వచ్చిన జీవో ఇప్పుడు అమలు చేస్తున్నాం

మూసీ నది ప్రక్షాళన ప్రజలకి స్వచ్ఛమైన గాలి నీరు అందించాలని అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇవాళ మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంగా నదికి సంబంధించిన కూడా ప్రక్షాళన జరిగినప్పుడు బఫర్ జోన్,ftl ఇవ్వటం జరిగింది ఎందుకంటే వరదలు వచ్చినపుడు ఎలాంటి నష్టం జరగకూడదు అని ఆయన తెలిపారు. 2017 వచ్చిన go ఇప్పుడు అమలు చేస్తున్నామని, NGO లతో కలిసి మేము మీటింగ్ నిర్వహించామని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా వాసన వస్తుందని, గతంలో టెండర్ పిలిచారు కానీ పనులు జరుగలేదన్నారు. 15000 ఎకరాల్లో ఫార్మా సిటీ వస్తుందని ఆయన అన్నారు. జహీరాబాద్‌లో కాలుష్యం లేని హ్యుందాయ్ కంపెనీ వస్తుందని, ఏ ఫ్యాక్టరీ రావొద్దు యువతకి ఉపాధి కల్పించవద్దు అని వారి ఆలోచన.. కచ్చితంగా మేము యువతకి ఉపాధి కల్పిస్తాము…. తరువాత ఎన్నికలకు పోతామని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు కొండా సురేఖ అంశంపై వివరణ ఇచ్చారు అంతటితో అంశం ఐపోయిందని, నేను 5000 రూపాయలు ఇస్తాము అని నేను మాట్లాడలేదు … వ్యక్తిగతంగా నేను ఎప్పుడు మాట్లాడలేదన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. స్కిల్ యూనివర్శిటీ సంబంధించిన అడ్మిషన్స్ అక్టోబర్ జరిగే అవకాశం ఉంది.. యూనివర్సిటీ కి సంబంధించిన బాధ్యతలు మొత్తం కూడా ఆనంద్ మహేంద్రా చూసుకుంటారన్నారు.

మతాలకు అతీతంగా దేశ ప్రతిష్ఠను పెంపొందించేవి క్రీడా మైదానాలే

ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారని అన్నారని.. ఇది బాధ కలిగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. ఒలింపిక్స్‌లో భారత్ స్థితిపై యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌ రెడ్డి. క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేసినట్టు ఆరోపించారు సీఎం రేవంత్‌. రానున్న కాలంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు అకాడమీలు ప్రారంభించి క్రీడాకారులకు సమర్థమైన శిక్షణ అందించాలని అన్నారు. చదువు , క్రీడల్లో ప్రగతి సాధించాలని యువతకు సూచించారు. క్రీడాకారులే దేశ ప్రతిష్ఠను పెంచుతారని ఆయన గుర్తించారు.

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం..

డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ మా ప్రభుత్వ లక్ష్యం అని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ‘నార్కోటిక్ కంట్రోల్ సెల్’ ఏర్పాటు చేస్తామన్నారు. మాదక ద్రవ్య కేసులను ఛేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.. ‘స్టేట్ టాస్క్ ఫోర్స్’ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతాం అన్నారు. టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీల వినియోగంతో డ్రగ్స్ ను నివారిస్తాం అని ఆమె పేర్కొన్నారు. వ్యూహాత్మక చెక్ పోస్టులు, హాట్ స్పాట్ లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బీట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ అరికడతాం.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి ఆచూకీ చెప్పి పట్టిస్తే ప్రభుత్వం తరపున రివార్డులు అందిస్తామన్నారు. వీధులను, విద్యా సంస్థలను కమ్మేసిన గంజాయి రక్కసిని అంతం చేస్తామని మంత్రి అనిత చెప్పారు.

రైతులకు గుడ్‌న్యూస్‌.. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్సీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఈసారి 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు జిల్లాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్​ సప్లయిస్​ ఎండీ డీఎస్​ చౌహన్​, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్​ రావు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అకౌంట్లలో నగదు ఖాళీ.. కస్టమర్లు గగ్గోలు

బ్యాంక్ అకౌంట్లలో ఉన్నట్టుండి నగదు మాయం అయితే ఎలా ఉంటుంది. తమ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు సడన్‌గా మాయం అయితే గుండె ఆగినంత పని అవుతుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేశారా? లేదంటే ఇంకెవరైనా దోచుకున్నారా? అన్న భయంతో తీవ్ర ఆందోళన చెందుతాం. ఇలాంటి పరిస్థితే అమెరికాలో కస్టమర్లకు ఎదురైంది. వేలాది మంది బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా ఖాతాదారులకు ఈ పరిణామం ఎదురైంది. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సేవల్లో బుధవారం మధ్యాహ్నం పెద్దఎత్తున అంతరాయం ఏర్పడింది. కస్టమర్లు తమ ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ ఖాతాలో బ్యాలెన్స్‌ కనిపించడం లేదంటూ ఆందోళన చెందారు. కొందరి అకౌంట్లలో జీరో బ్యాలెన్స్‌ కనిపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, డల్లాస్, ఫీనిక్స్, హ్యూస్టన్, చికాగో వంటి ప్రధాన నగరాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. ‘‘ఖాతాలు తాత్కాలికంగా అందుబాటులో లేవు’’ అని కొంతమందికి.. బ్యాంకింగ్ యాప్‌లోకి లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ‘‘కనెక్షన్ ఎర్రర్’’ అని చాలా మందికి మెసేజ్‌ చూపించింది.