నేడు కస్గంజ్లో అమిత్ షా, బరేలీలో సీఎం యోగి పర్యటన..
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం కాన్పూర్లోని తిలక్ నగర్ ప్రాంతంలో బీజేపీ సంస్థాగత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై మృతదేహం
ఢిల్లీలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని కొత్వాలి ప్రాంతంలో ఓ యువకుడిని రాయి, కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో దుకాణం పైకప్పుపై యువకుడి మృతదేహాన్ని చూసిన కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మృతదేహంపై సమాచారం అందుకున్న క్రైం, ఎఫ్ఎస్ఎల్ టీమ్తో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పోలీసులు విచారణలో మృతదేహం దగ్గర మద్యం సీసా, రెండు గ్లాసులు లభ్యమయ్యాయి. మద్యం సేవిస్తూ వచ్చిన వివాదంలో యువకుడు హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన యువకుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతదేహం పరిస్థితి మరీ విషమంగా ఉంది. రాయి, కత్తి దెబ్బలకు ముఖం మొత్తం చిధ్రమైంది.
నేడు నాలుగు నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
నేడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వేములవాడ, మానకొండూర్, కరీంనగర్, చొప్పదండి నియోజక వర్గాల్లో కేటీఆర్ పర్యటించనున్నారు. కరీంనరగ్ పార్టమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరుపున ప్రచారం చేయనున్నారు.
మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్
నేటి నుంచి సీఎం జగన్ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్ వస్తున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోనే.. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.. అలాగే. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో సభకు హాజరుకానున్నారు జగన్. సభ తర్వాత తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు.
నేడు వరంగల్ లో కేసీఆర్ బస్సుయాత్ర.. హనుమకొండ చౌరస్తాలో ప్రసంగం..
నేడు వరంగల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేరుకోనుంది. హనుమకొండ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ నగరానికి వెళ్లనున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి సుధీర్ కుమార్ తరపున హనుమకొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇవాల సాయంత్రం 4 గంటలకు నగరానికి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం జిల్లా నేతలతో కలిసి బస్సులో అదాలత్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, పెట్రోల్ పంపు జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తాకు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగించనున్నారు.
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం అల్లూరు గ్రామ సమీపంలో హెలిప్యాడ్ స్థలాన్ని మాండ్ర శివానందరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.
శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందంటూ కేసీఆర్ ట్విట్.. అంతా అబద్దమన్న భట్టి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్విట్టర్లో చేసిన ప్రకటన అవాస్తవమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేల తో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండుసార్లు కరెంటు పోయిందని మాజీ సీఎం కేసీఆర్ తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో పేర్కొనడం అంతా అబద్దమని పేర్కొన్నారు. ఆయన ప్రకటనను ఖండిస్తున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి ప్రకటనపై స్పందించి స్థానిక ట్రాన్స్కో ఎస్సీ ని విచారణకు ఆదేశించగా ఆయన ప్రకటనలో వాస్తవం లేదని నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు.
నేడు తూ.గో జిల్లాలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. పిఠాపురం నుంచి పోటీ చేస్తు్న్న జనసేనాని పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొంటారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి పిలుపునిచ్చారు. పట్టణంలోని గొల్లగూడెం సెంటర్ రామాలయం వద్ద సాయంత్రం 5.30 గంటలకు పవన్కల్యాణ్ బహిరంగ సభ జరుగుతుందన్నారు. తాడే పల్లిగూడెం నుంచి పిప్పర మీదుగా గణపవరం చేరు కుంటారని జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. గణపవరం సెంటర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.