కోటి దీపోత్సవం 12వ రోజు.. ఇల కైలాసంలో నేటి విశేష కార్యక్రమాలు ఇవే..
కార్తిక మాసంలో ప్రతీ ఏటా భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే కోటి దీపోత్సవం 12వ రోజుకు చేరింది.. మరో రెండు రోజుల్లో ముగియనున్న ఈ దీపయజ్ఞం వేదికగా భక్తులతో కిటకిటలాడుతోంది.. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తు్నారు.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.
ఇక, కోటి దీపోత్సవం వేదికగా 12వ రోజు జరిగే విశేష కార్యక్రమాలు ఇవే..
* వైకుంఠ చతుర్ధశి శుభసందర్భంగా కైలాస ప్రాంగణంలో తిరుమల వెంకన్న సాక్షాత్కారం
* అనంతకోటి పుణ్యప్రదం భక్తులచే గోవింద నామస్మరణ
* శ్రీదేవీభూదేవీ సమేత శ్రీనివాస కల్యాణం
* పల్లకీలో ఏడుకొండలస్వామి అనుగ్రహం
* కొల్హాపూర్ మహాలక్ష్మి, కంచికామాక్షి అమ్మవార్ల దర్శనభాగ్యం
* అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్తవిజయానంద తీర్థస్వామి అనుగ్రహ భాషణం
* పుష్పగిరి మహాసంస్థానం శ్రీ విద్యా శంకరభారతి మహాస్వామి ఆశీర్వచనం
* అంబరాన్ని అంటే మహాదేవుని నీరాజనాలు
* కోటి దీపాల వెలుగులు
* సప్తహారతుల కాంతులు
ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో ఘటనలో మరో ట్విస్ట్.. ఆ ఇద్దరు ఎవరు..?
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో ఘటనలో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వెలుగు చూస్తున్నాయి.. మొదట యూ ట్యూబర్ లోకల్ బాయ్ నానిపై ఆరోపణలు వచ్చినా.. ఆ తర్వాత అతని పాత్ర లేదనే నిర్ధారణకు వచ్చారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు నాని.. ఆ పిటిషన్పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.. మరోవైపు.. ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు.. 10:48 నిమిషాలకి హడావుడిగా బోటు నుండి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్టు ఆ సీసీ టీవీ ఫుటేజ్లో స్పష్టంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే రాత్రి 10:50కి అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం ప్రారంభ దశలో వెలుగులోకి వచ్చింది మరో వీడియో.. అయితే, అగ్ని ప్రమాదానికి ముందే హార్బర్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. ఎన్ టీవీకి చిక్కిన ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్ను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
నిప్పు వెనుక ఉప్పు చేప..! ఇదేం ట్విస్ట్..?
విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం ఘటనలో మరో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.. అసలు అగ్నిప్రమాదానికి కారణం ఏంటి? ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా తగబెట్టారా? లేదా ప్రమాదా వశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ సాగించారు. ఇప్పటికే ఈ కేసు ఎన్నో మలుపులు తిరరగా.. చివరకు అసలు నిప్పు వెనుక ఉన్నది ఉప్పుచేప అని చెబుతున్నారు పోలీసులు.. మత్స్యకారుల కుటుంబాల కొంప ముంచింది ఉప్పు చేప అంటున్నారు. ఫిషింగ్ హార్బర్ లోని బోటులో ఉప్పు చేప వేపుతున్నప్పుడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. ఉప్పు చేప వేపింది యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బంధువే అంటున్నారు. నానికి వరుసకి మామ అవుతాడట.. కొద్ది రోజుల క్రితం అదే బోటులో పనిచేశాడట నాని మామ.. అయితే, బోటులో ఉప్పు చేప ఫ్రై చేస్తున్న సమయంలో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.. మద్యం మత్తులో మంచింగ్ కోసం ఉప్పు చేప ఫ్రై చేస్తుండగా.. అగ్నిప్రమాదం సంబంధించి 40 బోట్లు పూర్తిగా, 9 బోట్లు పాక్షికంగా కాలిపోవడానికి కారకులు అయ్యారు ఇద్దరు వ్యక్తులు.
ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివర అంకానికి చేరుకోగా.. ప్రచారంలో అన్ని పార్టీల స్పీడ్ పెంచాయి. కాగా, నేడు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు.
ప్రధాని మూడు రోజుల షెడ్యూల్:
* ఇవాళ మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ
* అక్కడి నుంచి 2:05 గంటలకు కామారెడ్డిని బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు మోడీ
* మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ
* ఆ సభ అనంతరం సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోడీ
* నేటి సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో మోడీ హాజరు
* నేటి రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బస
* రేపు దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్న ప్రధాని మోడీ
* రేపు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు..
* మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు.. మ. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ
* ఆ సభ అనంతరం నిర్మల్ కు మోడీ.. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో హాజరు
* నిర్మల్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి వెళ్లనున్న ప్రధాని మోడీ
* ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్డు షో
* ఎల్లుండి తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ
* మహబూబాబాద్ చేరుకుని మ. 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభకు మోడీ హాజరు.. ఆ సభ అనంతరం కరీంనగర్ కు వెళ్లనున్నారు..
* మ. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. ఇక, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకోనున్నారు..
* సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్న మోడీ
* విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు పయనం
వడ్డీ లేకుండానే హోమ్ లోన్లు..! కేటీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పెద్ద పెద్ద పార్టీలు వాగ్దానాలు చేసిన సంగతి తెలిసిందే. అన్ని పార్టీల మేనిఫెస్టోలు వచ్చేశాయి, ఓటింగ్ ప్రక్రియకు సమయం కూడా దగ్గరపడుతోంది. కాంగ్రెస్ ఇప్పటికే ఆరు హామీలతో పెద్ద పెద్ద వాగ్దానాలు చేసింది. అన్ని వర్గాలను ఆకర్షించే దిశగా అడుగులు వేసింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా పలు హామీలను ప్రకటించినప్పటికీ… కొన్ని కీలక ప్రకటనలు చేస్తోంది. తాజాగా ఆటో వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లు ప్రకటించగా… తాజాగా మరో ప్రకటన చేశారు కేటీఆర్. హెచ్ఐసీసీలో క్రెడాయ్ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2023లో కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కొత్త ఇల్లు కొనాలనుకునే వారి కోసం కొత్త పథకాన్ని రూపొందించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు కావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరికీ ఇళ్లు అనే నినాదానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అయితే ప్రస్తుతం డబుల్ బెడ్రూం, గృహలక్ష్మి పథకాలు అలాగే ఉంటాయని, కొత్త ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రుణం తీసుకుని ఇల్లు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజల కోసం ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ పథకం ద్వారా రుణానికి సంబంధించిన వడ్డీని ప్రభుత్వం చెల్లించేలా కృషి చేస్తోందని కేటీఆర్ తెలిపారు. అదే సమయంలో, ఓటింగ్ ప్రక్రియ నవంబర్ 30న మాత్రమే ఉంటుంది. ప్రచారానికి అతి తక్కువ సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో… అధికార బీఆర్ఎస్ నుంచి కీలక ప్రకటనలు వస్తాయా అనే చర్చ కూడా సాగుతోంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో మరిన్ని అంశాలు చేరుస్తాయనే చర్చ మొన్నటి వరకు జరిగినా…అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో ఆలోచించాలని నేతలు ప్రకటనలు చేస్తూ ప్రజలను ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు.. మోడీ, అమిత్షా, యోగీ, జేపీ నడ్డా ప్రచారం
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనాయకత్వం వరుస పర్యటనలకు సిద్ధమైంది. ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 8 రోజులుగా బీజేపీ విజయావకాశాలు ఎక్కువగా ఉన్న జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి చెందిన పలువురు అగ్రనేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఒకరోజు పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ, స్వతంత్ర సంస్థలు, ఇతర మాధ్యమాలు చేస్తున్న సర్వేల్లో రాష్ట్రంలో భాజపాకు సానుకూల ఫలితాలు వస్తాయన్న ధీమాతో జాతీయ నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా నేడు, రేపు, (25, 26, 27) తేదీల్లో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటనలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలో బీజేపీ అగ్రనేతలు రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం. ఈ పర్యటనలో మోడీ రాజ్భవన్లో బస చేస్తారని వార్తలు వచ్చాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూబ్లీహిల్స్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. 23న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముథోల్, సంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ లలో సభలకు హాజరై హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ, రేపు, ఎల్లుండి (25,26, 27) తేదీల్లో వివిధ జిల్లాల్లో నిర్వహించే సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 28న రోడ్ షోతో ఆయన పర్యటన ముగిసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 25, 26 తేదీల్లో 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని సమాచారం. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరు సమావేశాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొంటారని సమాచారం.
సొంత గూటికి హార్దిక్ పాండ్యా.. ఏకంగా 15 కోట్లు!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తిరిగి సొంత గూటికి చేరనున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్.. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్కు మారే అవకాశాలు ఉన్నాయి. హార్దిక్ కోసం ఏకంగా రూ. 15 కోట్లు గుజరాత్ టైటాన్స్కు చెల్లించేందుకు ముంబై యాజమాన్యం సిద్ధంగా ఉందని సమాచారం. అయితే ఈ ట్రేడ్లో ముంబై నుంచి గుజరాత్ ఏ ఆటగాడినీ తీసుకోదట. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే ట్రేడింగ్ విండో మరొక్క రోజులో ముగియనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ను ట్రేడింగ్ విధానంలో తీసుకున్నట్లు ఇటు ముంబై ఇండియన్స్ గానీ.. అటు గుజరాత్ టైటాన్స్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ హార్దిక్ ముంబైకి తిరిగొస్తే.. అతడు రోహిత్ శర్మ సారథ్యంలో ఆడతాడా? లేదంటే అతడే కెప్టెన్గా ఉంటాడా? అన్నది ఆసక్తికరమే. మరోవైయిపు హార్దిక్ స్థానంలో గుజరాత్ టైటాన్స్కు శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశం ఉంది.
డిసెంబర్ 12న… లోకేష్ సినిమా అనౌన్స్మెంట్
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్-అమితాబ్ బచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. #Thalaivar170 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ టైటిల్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీలో ఎంకౌంటర్ కేసులో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని సమాచారం. డిసెంబర్ 12న రజినీకాంత్ బర్త్ డే కావడంతో ఆ రోజున తలైవర్ 170 సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ బయటకి రానున్నాయి. ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది కాబట్టి మేకర్స్ రజినీ ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ గ్లిమ్ప్స్ ని కూడా వదిలితే అంతకన్నా కావాల్సింది ఇంకొకటి లేదు.
బిగ్ బాస్ లో డబుల్ ఎలిమినేషన్..ఆ ఇద్దరు బయటకే..
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ షో దాదాపు ముగింపుకు చేరుకుంది.. 11 వ వారం ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.. అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ చెప్పాడు.. ఇక ప్రస్తుతం హౌజ్లో 10 మంది సభ్యులుండగా.. 12 వారం నామినేషన్స్లో ఏకంగా 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. రతికా , యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అమర్ దీప్, అశ్విని ఇలా 8 మంది నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. వీరికి మంగళవారం నుంచి నిర్వహించిన ఓటింగ్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. బిగ్ బాస్ 7 తెలుగు 12వ వారం ఓటింగ్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.. గత 11 వారాలుగా టాప్ ఓటింగ్ దూసుకుపోతున్న శివాజీ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు.. అమర్ దీప్ చౌదరి 17.41 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 11.5 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ప్రిన్స్ యావర్, 8.89 శాతంతో ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ హౌజ్లో కొనసాగుతున్నారు. ఇక రతికా రోజ్ 4.28 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉండగా.. ఇన్నే ఓట్లతో సమీపంలోనే అర్జున్ అంబటి కూడా ఉన్నాడు. ఇక చివరిగా అశ్విని శ్రీ ఏడో స్థానంలో ఉంది.. ఏ వారం డేంజర్ జోన్లో ఉన్నది మాత్రం రతిక, అర్జున్, అశ్విని.. ఈ వారం నాగ్ చెప్పినట్లుగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ముగ్గురిలోంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారు.. ఒక వేళ బిగ్ బాస్ ఓటింగ్నే పరిగణనలోకి తీసుకుంటే అర్జున్, అశ్విన్ ఈ వీక్ హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోతారు. అయితే ఎవిక్షన్ పాస్తో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చాన్స్ పల్లవి ప్రశాంత్ కు ఉంది. మరి ప్రశాంత్ ఎవిక్షన్ పాస్తో ఎవరినైనా సేవ్ చేస్తాడా? చేస్తే ఎవరిని చేస్తాడు అనేది ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే..
టైగర్ కి వంద కోట్ల నష్టాలు తప్పవా?
సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 సినిమా నవంబర్ 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ క్యామియోకి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. టైగర్ గా సల్మాన్ ఖాన్ చేసిన ఫైట్స్ కి బాలీవుడ్ సినీ అభిమానులు భారీ ఓపెనింగ్స్ ఇచ్చారు. దీపావళి రోజున రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు కన్నా డే 2, డే 3 ఎక్కువ రాబట్టింది. రెండు రోజుల్లో వంద కోట్లు, మూడు రోజుల్లో 180 కోట్లు రాబట్టి సల్మాన్ కెరీర్ లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసర్ గా టైగర్ 3 నిలిచింది కానీ ఆ తర్వాత నుంచే టైగర్ 3కి కష్టాలు మొదలయ్యాయి. ఇండియా న్యూజిలాండ్ సెమీ ఫైనల్ వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ లు టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ని పూర్తిగా దెబ్బ తీశాయి. ఓపెనింగ్ డే రోజున కూడా ఈవెనింగ్ ప్రతి ఒక్కరు పండగ చేసుకోవడంతో థియేటర్స్ కి ఎవరూ వెళ్ళలేదు. ఈ కారణంగా ఓపెనింగ్స్ లో కూడా కాస్త డ్రాప్ కనిపించింది. క్రికెట్ ఉన్న రోజులు, పండగ రోజు భారీ డ్రాప్ ని ఫేస్ చేసింది టైగర్ 3. ఈ డేట్స్ ముందే ఊహించి కాస్త జాగ్రత్త పడి ఉంటే టైగర్ 3 సినిమా కలెక్షన్స్ ఇంకా బాగుండేవి. ఓవరాల్ గా ఇప్పటివరకూ టైగర్ 3 సినిమా 425 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇది ఏ సినిమాకైనా చాలా ఎక్కువ కానీ టైగర్ 3కి మాత్రం కాదు. 600-700 కోట్ల పోటీషియల్ ఉన్న సినిమా రాంగ్ రిలీజ్ కారణంగా సరైన కలెక్షన్స్ ని తెచ్చుకోలేకపోయింది. టైగర్ 3 సినిమాని 300 కోట్ల బడ్జట్ తో తెరకెక్కించారు. డిసెంబర్ 1 వరకూ బాలీవుడ్ లో పెద్ద సినిమాల విడుదల లేదు కాబట్టి టైగర్ 3 సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఎంతవరకూ ఉంటాయో చూడాలి.