Today (27-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్లో క్రిస్మస్ మరుసటి రోజు నుంచి.. అంటే.. గడచిన రెండు రోజులుగా లాభాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ట్రెండ్ను శాంతాక్లాజ్ ర్యాలీగా పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి కూడా ఇవాళ సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. చైనాలో సైతం కొవిడ్ సంబంధిత ఆంక్షలను మరింతగా సడలిస్తున్నట్లు ప్రకటించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు బూస్ట్లా పనిచేసింది. దీంతో రెండు సూచీలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో గ్రోత్ నమోదు చేశాయి.
సెన్సెక్స్ 361 పాయింట్లు పెరిగి 60,927 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 117 పాయింట్లు ప్లస్సయి 18,132 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్ఈలోని మొత్తం 30 షేర్లలో టాటా స్టీల్ స్టాక్స్ విలువ 6 శాతానికి పైగా పెరిగింది. టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, విప్రో, లార్సన్ అండ్ టూబ్రో, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ లాభాలను ఆర్జించాయి.
read also: BookMyShow Report: సౌత్ సినిమాల మనీ సునామీ.. ఆసక్తికరంగా బుక్మైషో రిపోర్ట్
ఈ సూచీలో హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ షేర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. నిఫ్టీలో FACT, ధని సర్వీసెస్, జేబీఎం ఆటో, జిందాల్ స్టీల్, సీసీఎల్ ప్రొడక్ట్స్ లాభపడ్డాయి. అమరరాజా బ్యాటరీస్, యురేకా ఫోర్బ్స్, బ్రైట్కామ్ గ్రూప్, క్రిష్ణా ఇన్స్టిట్యూషన్స్, వరుణ్ బేవరేజెస్ నష్టపోయాయి.
రంగాల వారీగా పరిశీలిస్తే బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ నాలుగున్నర శాతానికి పైగా ప్రాఫిట్స్ పొందింది. కమోడిటీస్, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు కూడా మంచి పనితీరు కనబరిచాయి. ఒక శాతానికి పైగానే లబ్ధి పొందాయి.
10 గ్రాముల బంగారం ధర 158 రూపాయలు పెరిగి అత్యధికంగా 54 వేల 835 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు ఏకంగా వెయ్యి రూపాయలు లాభపడటం విశేషం. తద్వారా 70 వేల రూపాయలు దాటి చివరికి 70 వేల ఒక వంద వద్ద గరిష్ట ధర నమోదైంది. రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 79 పైసల వద్ద ఉంది.