కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు. కన్న బిడ్డలా చూసుకోవాల్సిన బాలికపై కామంతో కన్నేశాడు. పర్సనల్ ఫోటోలను అడ్డుపెట్టుకుని.. సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. తిరుపతిలో జరిగిన ఈ ఘోరం బాధితురాలి తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్కు బదిలీ చేశారు. నిందితుడు రామమూర్తిపై అత్యాచారంతో పాటు ఫోక్సో చట్టం కింద పోలీసులు వేట మొదలు పెట్టారు.
సెలవులకని తన ఇంటికి వచ్చిన కూతురు వరుస అయ్యే బాలికపై కన్నేసి కామాంధుడిలా ప్రవర్తించాడు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఏప్రిల్ నెలలో వేసవి సెలవుల కోసం తిరుపతిలోని తన చిన్నమ్మ (పిన్ని) ఇంటికి వెళ్ళింది. అక్కడ పిన్ని భర్త రామమూర్తి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్లో ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలను చూసిన నిందితుడు.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ ఫోటోలను అడ్డుపెట్టుకుని భయపెడుతూ బాధితురాలిపై రామమూర్తి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్ళిపోయినా ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం మానలేదు. పరీక్షలు రాసేందుకు హైదరాబాద్ వచ్చిన బాలిక మానసికంగా కృంగిపోవడాన్ని గమనించిన తల్లి.. నిలదీయగా అసలు విషయం బయటపడింది.
తన తమ్ముడు సమానుడైన బాబాయే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిసి తల్లి షాక్ తిన్నది. వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనా స్థలం తిరుపతి కావడంతో ‘జీరో ఎఫ్ఐఆర్’ (07/2026) నమోదు చేశారు. అనంతరం కేసును తిరుపతి ఈస్ట్ పీఎస్కు బదిలీ చేశారు. తిరుపతి పోలీసులు నిందితుడు రామమూర్తిపై భారతీయ న్యాయ సంహిత (BNS), పోక్సో (POCSO) చట్టం కింద కఠిన సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
