Mumbai Indians Win: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. జస్ప్రీత్ బుమ్రా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా తన తొలి విజయాన్ని అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్పై ఆరు వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై.. ఒక బంతి మిగిలి ఉండగా 205/4 స్కోరుతో మ్యాచ్ను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం తిలక్ వర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్.
201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ దూకుడైన ఆరంభాన్ని అందించాడు. కేవలం 23 బంతుల్లోనే 48 పరుగులు చేసిన రికెల్టన్ నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 25 పరుగులతో కీలక సహకారం అందించాడు. మధ్య ఓవర్లలో మ్యాచ్ మోమెంటమ్ పూర్తిగా ముంబై వైపు తిప్పింది తిలక్ వర్మే. ఒత్తిడి పరిస్థితుల్లోనూ అద్భుతమైన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 33 బంతుల్లోనే అజేయంగా 75 పరుగులు చేసి మ్యాచ్ను ఒంటిచేత్తో ముగించాడు. పంజాబ్ బౌలర్లు మధ్య మధ్యలో వికెట్లు తీసినా.. తిలక్ మాత్రం ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు.
చివర్లో విల్ జాక్స్ వేగంగా ఆడుతూ కేవలం 10 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేయడంతో ముంబై విజయానికి చేరువైంది. చివరకు ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ 32 బంతుల్లో 57 పరుగులతో పంజాబ్కు శుభారంభం అందించాడు. అనంతరం అజ్మతుల్లా ఒమర్జాయ్, జేవియర్ బార్ట్లెట్ కీలక పరుగులు జోడించడంతో పంజాబ్ భారీ స్కోరు నమోదు చేసింది.
అయితే ఆరంభంలో ఒత్తిడికి గురైన ముంబై బౌలర్లు తర్వాత పుంజుకుని పంజాబ్ను అదుపులోకి తెచ్చారు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ముంబై వైపు మళ్లింది. చివరకు తిలక్ వర్మ సూపర్ ఫినిషింగ్తో ముంబై అభిమానులకు థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది.
