విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈఓ సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై కమీషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. కమిషన్ ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇవ్వలేకపోయారు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు విచారణ కమిషన్ ప్రాథమికంగా గుర్తించింది. నోట్ ఫైల్, ఎమ్ బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఫాలో అయ్యారా? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు. ప్రసాదం స్కీంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏమయ్యాయని కమిషన్ ప్రశ్నించగా.. ఈఓ సుబ్బారావు ఏమీ చెప్పలేకపోయారు.
Also Read: AP-Telangana Border: ఏపీ, తెలంగాణ సరిహద్దు వద్ద ఉద్రిక్తత!
సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ఘటనపై ప్రభుత్వం త్రిసభ్య విచారణ కమిటీ నియమించింది. కమిషన్లో మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉన్నారు. గురువారం ప్రమాద ఘటనను మరోసారి పరిశీలించిన కమిషన్.. రీటైనింగ్ వాల్ కూలిపోవడంతో ప్రమాదం జరిగిందని స్పష్టం చేసింది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.