NTV Telugu Site icon

YS Viveka Case: వైఎస్‌ వివేకా హత్య కేసు.. ముగియనున్న డెడ్‌లైన్.. తర్వాతేంటి..?

Ys Viveka Case

Ys Viveka Case

YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది.. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది.. మరి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేదా సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌ కుమార్‌రెడ్డిని, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేసింది సీబీఐ.. అయితే, అరెస్ట్ చేసిన 90 రోజుల్లో నిందితులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్‌ వేయాల్సి ఉంటుంది.. వీరిపై జులై 12వ తేదీ లోగా ఛార్జిషీట్‌ వేయకపోతే బెయిల్‌ వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్‌పై వచ్చే నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో సీబీఐ మరింత సమయం కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..

Read Also: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!

జూన్ 30వ తేదీ లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను, అనుమానితులను విచారణ చేసిన సీబీఐ.. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఐదుసార్లు ప్రశ్నించింది.. వివేక హత్య కేసులో విచారణ ముగిసిందని భావిస్తుండడంతో.. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.. జులై 3న సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ సాగుతున్న నేపథ్యంలో.. ఈ కేసులో విచారణ కోసం మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2019 మార్చి 15వ తేదీన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.. అప్పటి నుంచి పలు రకాల మలుపు తిరుగుతూనే ఉంది.. అయితే, హైకోర్టు ఆదేశాలతో 2020లో ఈ కేసు సీబీఐకి చేరిన విషయం విదితమే.