Hyderabad Food Safety Raids: ఆహార భద్రతపై టీజీ సేఫ్ రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని క్యూఆర్ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు చెందిన మొత్తం 20 డార్క్ స్టోర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. తనిఖీల్లో పలు స్టోర్లలో పరిశుభ్రత ప్రమాణాల నిర్వహణలో లోపాలు, ఆహార పదార్థాల నిల్వ విధానంలో నిర్లక్ష్యం, అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన స్టోర్ల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర ఔషధాల నాణ్యతను, భద్రతను పర్యవేక్షించేందుకు ఏకీకృత వ్యవస్థగా ‘తెలంగాణ సేఫ్’ (TG-Safe – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ను అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నూతన అథారిటీ ద్వారా కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడం, నకిలీ, ప్రమాదకర మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెరిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిర్ణయించారు. ఫలితంగా పౌరులకు సురక్షితమైన ఆహారం, సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చి, ప్రజారోగ్యానికి సంపూర్ణ భద్రత చేకూరుతుందని ఆకాక్షించారు. ఇందులో భాగంగానే నేడు టీజీ సేఫ్ ఈ చర్యలు చేపట్టింది.

