LRS Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీము (LRS)కు సంబంధించిన గడువు పొడిగింపుపై ఓ కీలక నిర్ణయం తీసుకుంది. LRS ఫీజుపై ఇచ్చే 25 శాతం రాయితీని మే 31 వరకు పొడిగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి జీవో జారీ చేశారు. ఇకపోతే, మార్చి నెల నుంచి అమల్లో ఉన్న ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం గతంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు ఒకసారి పొడిగించగా.. ఆ గడువును ఆ తర్వాత మళ్లీ మూడు రోజులు అదనంగా పొడిచించారు. తాజాగా, మరో నెల రోజుల పాటు ఈ రాయితీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Sachin Tendulkar: విరాట్ కోహ్లీ టెస్టు రిటైర్మెంట్ పై సచిన్ టెండూల్కర్ భావోద్వేకం..!
ఇక లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS)లో సుమారు 20 లక్షల మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు అందిన దరఖాస్తుల్లో కేవలం 6 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. మిగిలిన దరఖాస్తుదారులు ఇప్పటికీ స్పందించకపోవడంతో, పురపాలక శాఖ అధికారులు గడువు పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, రాయితీ గడువును ఈ నెలాఖరు (మే 31) వరకు పొడిగించాలని నిర్ణయించింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
ఫీజు చెల్లించిన దరఖాస్తుదారుల్లో 40 శాతం మందికి అధికారులు ఇప్పటికే ప్రొసీడింగ్స్ కూడా జారీ చేశారు. ఇప్పటి వరకు LRS రాయితీపై ప్రభుత్వానికి రూ.1900 కోట్లకు పైగా ఆదాయం లభించింది. తాజాగా గడువు పొడిగింపు వల్ల, మరిన్ని దరఖాస్తుదారులు స్పందించేందుకు అవకాశం ఉంది.