రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాలపై యాజమాన్యం తనదేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 2004లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు సంస్థకు ఈ భూమిని కేటాయించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చట్టపరంగా గెలవడం ద్వారా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూమిపై యాజమాన్యాన్ని దక్కించుకుంది. ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాదమైనా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ యూనివర్సిటీ)ది కాదని తేలింది.. ఈ భూమిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి ప్రణాళికలో ఏ చెరువు (లేక్) లేదు.. కొత్తగా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళిక అక్కడ ఉన్న రాళ్ల రూపాలను (Rocks formation) దెబ్బతీయదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న ప్రతి ప్రణాళికలో స్థానిక సుస్థిరాభివృద్ధి… పర్యావరణ అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుత ప్రాజెక్ట్ ను వ్యతిరేకించే వారంతా కొందరు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారుల (రియల్ ఎస్టేట్) ప్రయోజనాలకు అనుగుణంగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25 లోని 400 ఎకరాల భూమికి సంబంధించి కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన తప్పుదోవ పట్టించే కథనాలు తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీ ఐఐసీ) దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఆ భూమికి సంబంధించిన వాస్తవాలు ప్రజల ముందుంచుతున్నాం…
ఆ భూమికి సంబంధించిన చట్టపరమైన అంశాలు…
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వేనంబర్ 25లోని 400 ఎకరాల భూమిని 2004, జనవరి 13వ తేదీన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా వసతుల అభివృద్ధికి ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్కు మెమో నంబర్ 39612/Assn/V(2) 2003 ప్రకారం కేటాయించింది. ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ తన ప్రాజెక్టును ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం: 111080/S1/2003 ప్రకారం ఆ కేటాయింపును రద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు దానిని కేటాయించింది.
ఈ భూమి కేటాయింపులపై ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ హైకోర్టులో 2006లో రిట్ పిటిషన్ నంబర్ 24781/2006 దాఖలు చేసింది. ఈ న్యాయపోరాటం సుదీర్ఘ కాలం కొనసాగింది. రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో (రిట్ పిటిషన్ నంబర్ 24781/2006) గౌరవ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా 2024, మార్చి 7వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. గౌరవ హైకోర్టు తీర్పును ఐఎంజీ అకడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (సీ) నంబర్ 9265/2024 ద్వారా సవాల్ చేసింది. ఈ పిటిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాడింది. 2024, మే 3వ తేదీన గౌరవ సుప్రీంకోర్టు ఐఎంజీ అకడమీస్ దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి దక్కింది. టీజీఐఐసీ విజ్ఞప్తి మేరకు.. శేరిలింగంపల్లి మండలం డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్రకారం కంచెగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు కంచ అస్తబల్ పోరంబోకు సర్కారీ (అంటే… ప్రభుత్వ భూమి అని) అని నిర్ధారించారు. ఆక్రమణలకు గురికాకుండా తర్వాత అభివృద్ధి పనులకుగానూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని వారు సూచించారు.
2022, సెప్టెంబరు 14న జారీ చేసిన జీవో ఎం.ఎస్.నంబర్ 571, రెవెన్యూ (అస్సైన్-1) డిపార్ట్ మెంట్ ప్రకారం భూ కేటాయింపులకు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కొలిచి హక్కులు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఐ అండ్ సీ విభాగం 2024, జూన్ 19న సూచించింది. ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు తమకు ఆ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ 2024, జూన్ 19న ప్రతిపాదనలు సమర్పించింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను టీజీ ఐఐసీకి బదలాయిస్తూ 2024, జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. శేరిలింగంపల్లి మండల రెవెన్యూ అధికారులు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి పంచనామా నిర్వహించి 2024, జులై 1వ తేదీన టీజీ ఐఐసీకి అప్పగించారు. ఈ విధంగా ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వం స్వాధీనంలో ఉంది. కొన్ని మీడియాల్లో తప్పుడుగా వస్తున్నట్లు అటవీ భూమిగా లేదని రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉందని స్పష్టమవుతోంది.
యూనివర్సిటీ ఆప్ హైదరాబాద్ అధికారులతో సమన్వయంతోనే హద్దుల గుర్తింపు…
తమకు కేటాయించిన 400 ఎకరాల భూమికి సంబంధించిన ఉమ్మడి హద్దుల గుర్తింపునకు తమ అధికారులకు సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ సైబరాబాద్ జోనల్ మేనేజర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్కు 2024, జులై 04వ తేదీన లేఖ రాశారు. టీజీఐఐసీ అధికారులు తమ బృందంతో పాటు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ను 2024, జులై 7వ తేదీన వ్యక్తిగతంగా కలిసి తమ ప్రాజెక్ట్ ప్రతిపాదనలను ఆయనకు వివరించారు. సర్వే నిర్వహణ విషయంపై టీజీఐఐసీ జోనల్ మేనేజర్ 2024, జులై 18న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ మెయిల్ registrar@uohyd.ac.in కు మెయిల్ చేశారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రిజిస్ట్రార్ సమ్మతితోనే 2024, జులై 19న యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ రిజిస్ట్రార్, యూనివర్సిటీ ఇంజినీర్, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్ సమక్షంలో సర్వే జరిగింది. అదే రోజు హద్దులు నిర్ధారించారు. టీజీఐఐసీ అభివృద్ధి చేస్తున్న 400 ఎకరాల్లో బఫెల్లో లేక్, పీకాక్ లేక్ లేవు. కొన్ని మీడియాల్లో వీటి విషయంలో తప్పుడు వార్తలు వస్తున్నాయి.
రాళ్ల అమరిక, చెరువుల (లేక్స్) పరిరక్షణ…అక్కడ చేసిన సర్వేను పరిశీలించిన టీజీఐఐసీ తాము చేసే లేఅవుట్లో మష్రూమ్ రాక్స్తో పాటు ఇతర రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను హరిత స్థలాలుగా (గ్రీన్ స్పేస్) పరిరక్షించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. తర్వాత మాస్టర్ప్లాన్లో ఆ ప్రాంతంలో సుస్థిరాభివృద్ధికి సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళిక (ఈఎంపీ) తయారు చేయాలని నిశ్చయించింది. పైన పేర్కొన్న అంశాలను గమనిస్తే టీజీఐఐసీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములు ఆక్రమించలేదని, ఇప్పుడు ఉన్న జల వనరులు (లేక్స్), రాళ్ల అమరిక (రాక్ ఫార్మేషన్)ను దెబ్బతీయడం లేదని స్పష్టమవుతోంది. ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని మాస్టర్ప్లాన్ ప్రకారం సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు 2025, ఫిబ్రవరి 28న టీజీఐఐసీ RFP (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్) జారీ చేసింది. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక వసతులు, అనుసంధానత పెంపు, తగినంత పట్టణ స్థలాల లభ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు కట్టుబడి ఉంది.